Mekapati Chandra Sekhar Reddy: రోడ్లు వేయాలని కోరిన ప్రజలు.. డబ్బుల్లేవు కుదరదన్న వైసీపీ ఎమ్మెల్యే

Mekapati Chandra Sekhar Reddy: ఏపీలో అధికార పార్టీలో అసంతృప్తి మెల్లమెల్లగా రగులుకుంటుంది. క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా.. గత ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసిన జిల్లా నెల్లూరులో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. పార్టీ పదవుల నుండి కూడా ఈ ఇద్దరినీ తప్పించగా.. త్వరలోనే మరో ఎమ్మెల్యే కూడా ఇదే బాటలోకి రానున్నారని ప్రచారం జరుగుతుంది.
ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి కూడా పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం మొదలు పెట్టారు. తన నియోజకవర్గంలో పరిశీలకుడు చిచ్చు పెడుతున్నారని ఈ మధ్యనే మీడియా ముందుకొచ్చిన చంద్రశేఖర్ రెడ్డి.. తనను పరిశీలకుడు ధనుంజయరెడ్డి ఇబ్బంది పెడుతున్నారని.. సీఎంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరో వచ్చి తన మీద పెత్తనం చేయడానికి కుదరదని.. దీనిపై సీఎం, మంత్రి దగ్గర తేల్చుకోవడమే కాదు.. దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు.
కాగా, ఇప్పుడు మేకపాటి మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగసముద్రంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని.. గ్రామస్థులు గ్రామంలో సీసీ రోడ్లు వేయాలని కోరారు. అయితే ఎమ్మెల్యే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని, రోడ్లు వేయలేమని తేల్చి చెప్పారు. అంతేకాదు, వేసిన రోడ్లకు బిల్లులు రాక డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని.. మళ్ళీ కొత్త రోడ్లు ఎక్కడ వేయగలమని ప్రజలనే ప్రశ్నించారు.
దీంతో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో స్థానికులు, అధికారులు, నాయకులు అవాక్కయ్యారు. ప్రభుత్వం దగ్గర డబ్బులేకపోయినా దాన్ని శాంతంగా చెప్పాల్సిన ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం వెనక అర్ధం వేరే ఉందని అర్ధమవుతుంది. ఇప్పటికే చేసిన పనులకు కాంట్రాక్టర్లను బిల్లులు రాలేదని వాపోతున్నారు. ఉన్నవన్నీ తాకట్టు పెట్టి మరీ పనులు చేయించగా.. ప్రభుత్వ ఖజానాలో డబ్బులేక ఎక్కడివక్కడే ఆగిపోయాయి. కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. అసలే అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యే మేకపాటి ఈ అంశంలో ఓపెన్ అయినట్లుగా కనిపిస్తుంది.