MLA Mekapati: 18 ఏళ్ళు కాపురం చేసిన నేనెవరిని?.. ఎమ్మెల్యే మేకపాటి వివాదం
MLA Mekapati: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను కొడుకుగా ఒప్పుకోవాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ రాయడం.. లేఖతో పాటు పాత ఫొటోలు కూడా శివచరణ్ రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. లేఖపై స్పందించిన చంద్రశేఖర్ రెడ్డి అసలు తనకు కుమారుడే లేడని తనకు ఇద్దరు కూతుళ్లు మాత్రమే ఉన్నారని చెప్పారు.
తన మొదటి భార్య తులసమ్మకు రచనారెడ్డి, రెండో భార్య శాంతకుమారికి సాయి ప్రేమితారెడ్డి ఉన్నారని.. వీళ్లే తన కూతుళ్లని వెల్లడించారు. కేవలం డబ్బు కోసమే తల్లీ, కొడుకులు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శివచరణ్ రెడ్డి.. నీకు కొడుకు లేకపోతే మరి నేను ఎవరిని? అని ప్రశ్నించిన శివచరణ్ రెడ్డి.. తాను డీఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధమేనని సవాల్ విసిరారు.
కాగా.. ఇప్పుడు శివచరణ్ రెడ్డి తల్లి కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తమను నమ్మించి మోసం చేశారని శివచరణ్రెడ్డి తల్లి లక్ష్మీదేవి ఆరోపించారు. మేకపాటి చంద్రశేఖర్రెడ్డి రెండేళ్ల పాటు తన చుట్టూ తిరిగి బెంగళూరులో 18 ఏళ్ల పాటు కాపురం చేసి తనను వదిలిపెట్టారని లక్ష్మీదేవి ఆరోపించారు. శాంతి కుమారి పరిచయం అయిన తర్వాత శేఖర్ రెడ్డిలో మార్పు వచ్చిందని.. ఆమె వల్లే తమకు దూరంగా ఉన్నారని లక్ష్మీదేవి వెల్లడిం చారు.
డబ్బు, ఆస్తుల కోసం తాము ఆరోపణలు చేస్తున్నామని చెప్పడం సరికాదన్న ఆమె
చంద్రశేఖర్రెడ్డి మాటలతో అవమానం భరించలేక ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చానన్నారు. తమకు సొంత ఇల్లు కూడా లేదని.. శాంతకుమారి వద్ద ఎన్ని ఆస్తులు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. కాగా, ఇటీవల తనకు ఆస్తి ముఖ్యం కాదని.. గుర్తింపు కావాలని కోరుకుంటున్నానని శివచరణ్రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. మరి లక్ష్మీదేవి ఆరోపణలపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.