Mekapati Chandrasekhar Reddy: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు.. చెన్నై ఆసుపత్రికి తరలింపు!

Mekapati Chandrasekhar Reddy: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కార్యకర్తలు, అభిమానులు ఆయనను వెంటనే ముందుగా నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనను పరీక్షించి, గుండెపోటుకు గురయ్యారని వెల్లడించారు. ఇప్పటికే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆయన గుండెలో రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు పరీక్షలలో బయటపడినట్లు తెలిసింది.
ప్రస్తుతం మేకపాటికి వైద్యులు చికిత్స అందిస్తుండగా.. ఎమ్మెల్యే పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైకి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని చెన్నైకి తరలిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై మరింత సమాచారం అందాల్సి ఉంది. కాగా ఆయనకు గతంలోనే ఓసారి గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు రాగా.. బెంగుళూరులోని ఆస్ట్రా వైద్యశాలకు తరలించారు.
అప్పుడు మూడు రోజుల చికిత్స అనంతరం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆసుపత్రి నుంచే ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తాజాగా మేకపాటికి మరోసారి గుండెపోటు గురవ్వడం అభిమానులు, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. 2019లో వైఎస్సార్సీపీ నుంచి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు.
కాగా, ఇటీవల ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త విషయంలో ఆయన సొంత పార్టీపై విమర్శలు చేశారు. దీంతో ఎట్టకేలకు ఆయన అభ్యర్థన మన్నించి కొత్త సమన్వయకర్తను నియమించారు. అంతకు ముందు తనను కొడుకుగా ఒప్పుకోవాలంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ రాయడం.. యువకుడి తల్లి లక్ష్మీ కూడా చంద్రశేఖర్ రెడ్డి తనతో 18 ఏళ్ల పాటు కాపురం చేసి తనను వదిలిపెట్టారని ఆరోపించడం కూడా కలకలంరేపింది. ఈ మధ్యనే గడపగడపకి కార్యక్రమంలో తాను రానున్న ఎన్నికలలో పోటీకి దిగనని కూడా ప్రకటించి ఆశ్చర్యపరచగా.. ఇప్పుడు ఇలా గుండెపోటుకు గురయ్యారు.