Earthquake: మరు భూమిగా అందమైన నగరాలు.. మృతుల సంఖ్య 20 వేలు ఉండొచ్చని అంచనా?

Earthquake: టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. సోమవారం వరుసగా మూడు అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించగా.. ఈ భారీ భూకంపాల ధాటికి అందమైన నగరాలు మరుభూమిగా మారిపోయాయి. భవనాలు, కట్టడాలు పేక మేడల్లా కూలిపోగా.. శిధిలాల కింద బతుకులు చితికిపోయాయి. ఒకపక్క సహాయక కార్యక్రమాలు జరుగుతుండగానే.. మృతుల సంఖ్య వేలల్లో ఉంటుంది.
ఈ భూప్రకంపనల కారణంగా ఇప్పటికి 7 వేలకు పైగా మృత్యువాత పడగా.. ఇది 20 వేల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోగా తవ్వేకొద్దే మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. గడిచిన 20 ఏళ్లలో అత్యధికంగా ప్రాణ నష్టం, ప్రకృతి వినాశనం సృష్టించిన భూకంపాల్లో ఇదొకటని పర్యావరణ నిపుణులు, భూగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బుధవారం ఉదయం నాటికి టర్కీ , సిరియా దేశాల్లో 7,800 మందికి పైగా భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోగా.. 20 వేల మందికి పైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా వేస్తోంది. భారీ భూకంపం వల్ల 23 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతారని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. ఒక్క టర్కీలోనే 5,400 మంది మృతి చెందగా.. సిరియాలో దాదాపు 1900 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. శిథిలాల కింద చిక్కుకున్న తమవారి కోసం బ్రతికున్న వారు రోధించడం గుండెలు పిండేలా చేస్తుంది.
చాలా చోట్ల మంచు, చలి వల్ల సహాయక చర్యలకు ఆటంకాలేర్పడుతుండగా.. దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాల్లో చాలా చోట్ల మైనస్ 8 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ , చైనా, గల్ఫ్ స్టేట్స్ తో సహా చాలా దేశాలు టర్కీ, సిరియా దేశాలకు సహాయం చేయడానికి ముందుకు రాగా.. కష్టాల్లో ఉన్న టర్కీని ఆదుకునేందుకు భారత్ శాయశక్తులా కృషి చేస్తోంది. 101 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టర్కీ సహాయక చర్యలలో ఉన్నాయి.