Kahramanmaras earthquake: 100 సార్లు కంపించిన భూమి.. 4 వేలకి చేరువలో మృతులసంఖ్య

Kahramanmaras earthquake: టర్కీ, సిరియా ఒకేరోజు మూడు భారీ భూకంపాలతో వణికిపోయాయి. ఈ దేశాల సరిహద్దుల్లోని నగరాల ప్రజలు గాఢనిద్రలో ఉండగా భూవిలయం సంభవించింది. సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నంలోపు మూడుసార్లు భూకంపం రావడంతో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. సోమవారం తెల్లవారు జాము నుండి మంగళవారం ఉదయం వరకు సుమారు 100 సార్లు ఇక్కడ భూమి కంపించింది. తొలుత భారీ భూకంపం.. ఆ తర్వాత చిన్న ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజులు కూడా రిక్టర్ స్కేల్ పై 5 నుండి 6 వరకు ప్రకంపనలు కనిపించే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు.
ఈ భూవిలయంతో మృతులసంఖ్య 4 వేలకు చేరువలో ఉంది. ఇప్పటికే 6వేల మందికిపైగా గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఇంకెంతో మంది భవనాల శిథిలాల కింద ఉన్నారో తెలియడం లేదు. వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. టర్కీ, సిరియా దేశాలు వరుస భూకంపాలతో చిగురుటాకులా వణికిపోగా.. భూకంప ధాటికి అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. అందుకే ప్రాణ నష్టం ఈ స్థాయిలో ఉంది.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోగా.. శిథిలాల కింద నలిగిపోయిన వారి ఆర్తనాదాలతో ఆయా ప్రాంతాలు హృదయవిదారకంగా మారాయి. ఆ ప్రాంతాలన్నీ శ్మశానాలను తలపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో తెలియక జనం రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒక్క టర్కీలోనే దాదాపు 11 వేల మంది గాయపడ్డారు. చాలామంది స్థానికంగా ఉన్న మసీదుల్లో తలదాచుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. టర్కీకి సాయం చేసేందుకు భారత్ సహా మరికొన్ని దేశాలు ముందుకొచ్చాయి. సహాయక బృందాలను, సామాగ్రిని పంపిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయంప్రకటించిన కొద్ది గంటలలోనే భారత వైమానిక దళ విమానంలో సహాయక బృందాలు బయల్దేరాయి. నిపుణులైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అత్యంత నైపుణ్యంగల జాగిలాల స్క్వాడ్స్, ఔషధాలు, అడ్వాన్స్డ్ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్, సహాయక చర్యలకు అవసరమయ్యే ముఖ్యమైన పరికరాలతో వెళ్లారు. టర్కీకి బయలుదేరిన ఎన్డీఆర్ఎఫ్ బృందంలో మహిళలు కూడా ఉండటం విశేషం.