Yuvagalam: భయం నా బయోడేటాలోనే లేదు.. ఏం చేస్తావో చేసుకో పెద్దిరెడ్డి.. రెచ్చిపోయిన నారా లోకేష్

Yuvagalam: భయం మా బయోడేటాలో కూడా లేదు పెద్దిరెడ్డి.. ఏం చేస్తావో చేసుకో అంటూ తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రెచ్చిపోయారు. లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో 33 రోజులకు చేరుకుంది. ఈ యాత్ర ఈరోజు పుంగనూరులో కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేశ్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సభలో ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పై విరుచుకుపడ్డారు.
పెద్ది రెడ్డిని ఇక్కడ పెద్దాయన అని పిలవాలంట. ఎందుకు భూములు దోచిందానికి పెద్దాయన అని పిలవాలా? మట్టి మాఫియా చేసినందుకు పెద్దాయనని పిలవాలా? ఇసుక దోపిడీ చేసిన దానికి పెద్దాయనని పిలవాలా? ఎందుకు పెద్దాయనని పిలవాలి? అని ప్రశ్నించారు. ఇసుక, గంజాయి, ఎర్రచందనం, కబ్జాలు, దందాలు చేస్తున్నందుకు పెద్దయానని పిలవాలా అని నిలదీశారు.
శివశక్తి డైరీతో పెద్దిరెడ్డి రైతులను దోచుకుంటున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్టం మొత్తం అమూల్ ఉంది.. మరి పుంగనూరులో ఎందుకు అమూల్ లేదని నిలదీశారు. తాగే నీళ్ళు లీటరు రూ.20 అమ్ముతున్న రోజుల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి లీటర్ పాలుకు రూ.16 ఇచ్చారన్నారు. చల్లా బాబు పోరాటంతో ఆ ధరను ఇప్పుడు పెంచినట్లు తెలిపారు. అయినా బయట పాల డైరీలు ఇచ్చే ధర కంటే ఆరు రూపాయలు ఇప్పటికీ తక్కువ ఇస్తూ పాడి రైతులను దోచేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ రాష్ట్రంలో అమూల్ డైరీని తీసుకొచ్చారని.. పుంగనూరులో మాత్రం అమూల్ డైరీ లేదన్నారు. పాపాల పెద్దిరెడ్డి శివశక్తి డైరీ కోసం అమూల్ ను పుంగనూరుకు తీసుకురాలేదని లోకేష్ విమర్శించారు. పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పెట్టిన ఫ్యాక్టరీకే మామిడి అమ్మాలి.. లేదంటే దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇటు మామిడి రైతులు, అటు పాడి రైతులను దోచేస్తున్నారు. రైతుల భూములు ఖాళీగా కనపడితే చాలు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. పదివేల కోట్లపైన దోచుకున్నాడు పాపాల పెద్దిరెడ్డి అని మండిపడ్డారు.