TCongress: కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డిపై కేసు నమోదు.. సొంత పార్టీ నేతకు బెదిరింపుల ఎఫెక్ట్!

Kaburulu

Kaburulu Desk

March 7, 2023 | 02:05 PM

TCongress: కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డిపై కేసు నమోదు.. సొంత పార్టీ నేతకు బెదిరింపుల ఎఫెక్ట్!

TCongress: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్ ను బెదిరించిన వ్యవహారంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఈ కేసు నమోదు అయింది. తనను చంపుతానని కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారని సుహాస్ ఫిర్యాదు చేయడంతో ఏపీసి 506 సెక్షన్ కింద ఎంపీపై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

చెరుకు సుధాకర్ రెడ్డిని చంపేస్తామంటూ ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో ఓ కాల్ రికార్డింగ్ హల్చల్ చేసింది. అయితే ఈ కాల్ రికార్డింగ్ లో చెరుకు సుధాకర్ ను చంపేస్తామంటూ ఆయన తనయుడు డాక్టర్ సుహాస్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ఆ రికార్డ్ లో వాయిస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిదేనని ప్రచారం అయింది. దీనికి కోమటి రెడ్డి కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే, ఎంపీ వెంకటరెడ్డిపై కేసు నమోదు అయింది.

నల్గొండ జిల్లాకు చెందిన చెరుకు సుధాకర్ కొన్నాళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయనకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారనే టాక్ ఉంది. ఈయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఇతర పార్టీల నేతలపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. అయితే.. చెరుకు చేరికను మొదట్నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అప్పట్లో చెరుకు పార్టీలో చేరిన సమయంలో కోమటిరెడ్డి తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

గతంలో తనను ఓడిస్తానని సవాల్ చేసిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని.. రేవంత్‌ రెడ్డి పెద్ద తప్పు చేశారని మండిపడ్డారు. కాగా, ఇప్పుడు కోమటిరెడ్డి చెరుకు సుధాకర్ ను చంపేస్తామని బెదిరించారు. తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని.. చెరుకు సుధాకర్ ను చంపుతామని వంద వెహికిల్స్ తిరుగుతున్నాయని చెప్పారు. వారం రోజుల్లోనే చంపేస్తారని.. పరుష పదజాలాన్ని కూడా వాడారు. నిన్ను కూడా లేపేస్తారు.. నీ హస్పిటల్ ఉండదు.. అంటూ సుహాస్ కి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు ఆ ఆడియోలో ఉంది.