TCongress: కవిత విషయంలో నేను కాదు.. రేవంత్ రెడ్డి స్పందించాలి.. కోమటిరెడ్డి రియాక్షన్!

Kaburulu

Kaburulu Desk

March 8, 2023 | 09:40 PM

TCongress: కవిత విషయంలో నేను కాదు.. రేవంత్ రెడ్డి స్పందించాలి.. కోమటిరెడ్డి రియాక్షన్!

TCongress: సీఎం కేసీఆర్ కుమార్తె.. ఎమ్మెల్సీ కవితకి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సమన్ల విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే ఈ అంశంలో కవితను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్ నేతలందరూ మౌనంగానే ఉన్నారు. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మీడియా ప్రతినిధులు కవిత అంశంపై ప్రశ్నించినా.. ఈ అంశంలో స్పందించాల్సి నేను కాదు రేవంత్ రెడ్డి అంటూ తప్పించుకున్నారు.

కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంతవరకు రేవంత్ ఎందుకు స్పందించలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కవిత వ్యవహారంపై తమ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుగా స్పందించాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కాగా, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ తనయుడు చెరుకు సుహాస్‌ తనపై పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టులోనే తేల్చుకుంటానని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. న్యాయస్థానాలన్నా, న్యాయమూర్తులన్నా తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు.

చెరుకు సుధాకర్‌‌ ను చంపేందుకు తన అనుచరులు తిరుగుతున్నారని, వారం కంటే ఎక్కువ రోజులు బతకడం కష్టమంటూ సుధాకర్ కొడుకు సుహాస్‌కు ఫోన్ చేసి వెంకటరెడ్డి హెచ్చరించారు. సుహాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 506 సెక్షన్‌ ప్రకారం ఎంపీపై నల్లగొండలో కేసు నమోదైంది. బుధవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి వచ్చిన వెంకట్‌రెడ్డి తనపై నమోదైన కేసుపై మీడియా వద్ద స్పందించారు.

చెరుకు సుధాకర్‌పై తాను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే తప్ప ఎదుటి వ్యక్తికి హాని తలపెట్టే గుణం తనది కాదని చెప్పారు. కొన్ని నెలలుగా తనపై సొంత పార్టీలోని నాయకులే చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతోనే తమ అనుచరులు తట్టుకోలేకపోతే తానే వారిని సంయమనం పాటించాలని సూచించానన్నారు. దీన్ని తాను రాజకీయం చేయదల్చుకోలేదని కోర్టులోనే తేల్చుకుంటానని వెంకటరెడ్డి ప్రకటించారు.