TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై దాఖలైన పిటిషన్ల మీద హైకోర్టు విచారణ చేసింది. అనంతరం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని.. ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీల కేసుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటీషన్ పై నేడు వాదనలు జరిగాయి. దర్యాప్తు సక్రమంగా జరగట్లేదన్న ఆధారాలను పిటిషనర్లు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. పేపర్ లీకేజీ కేసు స్టేటర్ రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల సమయాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ తరపున లాయర్ వివేక్ థన్కా వాదనలు వినిపించారు. పేపర్ లీకేజీ కేసు సీబీఐకి ఇవ్వాలని కోరారాయన.
లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశం అని.. సిట్ దర్యాప్తు కంటే సీబీఐ విచారణతోనే అసలు నిందితులు బయటకు వస్తారని వివేక్ థన్కా వాదించారు. కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐతో విచారణ చేయించినట్లయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోర్టు దృష్టికి తెచ్చారు. కాంగ్రెస్ వాదనలకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కౌంటర్ వాదనలు వినిపించారు. ఇప్పటికే కేసు విచారణ సిట్ ఆధ్వర్యంలో జరుగుతుందని.. ఎంతో పారదర్శకంగా సాగుతుందని కోర్టుకు దృష్టికి తెచ్చారు.
రెండు వర్గాల వాదనలు విన్న హైకోర్టు స్టేటస్ రిపోర్ట్ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. విచారణ ఏ దశలో ఉంది.. ఇప్పటి వరకు చేసిన విచారణ ఏంటీ అనే వివరాలను కోర్టుకు అందించాలని ఆదేశించింది. అయితే సిట్ నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది సమయాన్ని కోరారు. దీనికి హైకోర్టు మూడు వారాల పాటు సమయాన్ని ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.