Paper Leakage Case: పేపర్ లీకేజ్ కేసు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు!

Kaburulu

Kaburulu Desk

March 20, 2023 | 09:11 PM

Paper Leakage Case: పేపర్ లీకేజ్ కేసు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు!

Paper Leakage Case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సిట్‌ విచారణ కొనసాగుతుంది. 9 మంది నిందితులను సిట్‌ అధికారులు మూడోరోజు విచారించారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌, రేణుక ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మరి కొందరిని విచారణకు పిలిచినట్లు తెలుస్తుంది. అనుమానితుల విచారణను గోప్యంగా ఉంచుతున్న పోలీసులు.. గ్రూప్‌-1 పరీక్ష రాసి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నవారిని ఫోన్‌లో విచారించారు.

ప్రవీణ్, రాజశేఖర్‌, రేణుక కస్టడీలో ఉన్నప్పుడే.. మరికొందరిని విచారించాలని సిట్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై ఎన్ఎస్యూఐ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, సుప్రీంకోర్టు న్యాయవాది వివేక్‌ధన్కా వాదనలు విన్పిస్తారని.. ఎన్ఎస్యూఐ తరపు న్యాయవాది కరుణాకర్‌ కోర్టుకు తెలిపారు. రేపటికి వాయిదా వేయాలని కూడా ఎన్ఎస్యూఐ తరపు న్యాయవాది కోరారు. దీంతో ఎన్ఎస్యూఐ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

కాగా, ఈ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. పేపర్ లీక్ విషయంలో ఆరోపణలు చేసిన రాజకీయ నేతలకు సిట్ నోటీసులు జారీ చేస్తోంది. సోమవారం ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. పేపర్ లీక్ విషయంలో చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని రేవంత్ రెడ్డిని నోటీసుల్లో సిట్ కోరింది. హైదరాబాదులో రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు.

అయితే, రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో సిట్ అధికారులు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి నోటీసులు అతికించారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ కేసులో మరికొందరికి కూడా నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశముందని సమాచారం. ఆధారాలు తమకు అందిస్తే దానిపై విచారణ జరుపుతామని సిట్ అధికారులు అంటున్నారు. కాగా, సిట్ నోటీసులపై స్పందించిన రేవంత్.. నోటీసులు ఇంకా తనకు అందలేదని తెలిపారు.