Delhi Liquor Scam: గంటల తరబడి ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు.. సర్వత్రా ఉత్కంఠ!

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుండి ఈ విచారణ కొనసాగుతుంది. సౌత్ గ్రూప్ లో కవిత పాత్రపై ఆరా తీస్తున్నారు. అలాగే.. సౌత్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులతో వ్యాపార సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఈడీ ఆఫీస్ కు కవిత న్యాయవాదుల బృందం చేరుకుంది. ఈడీ ఆఫీస్ కు తెలంగాణ అడిషనల్ ఏజీ రామచంద్రరావు తో పాటు.. న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, సోమా భరత్ కుమార్ చేరుకున్నారు.
సోమవారం ఈడీ కవిత విచారణలో ఈ స్కామ్ లో నిందితుడు, హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించారు. వీరిద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి నాలుగు గంటల సేపు ప్రశ్నించినట్టు సమాచారం. అనంతరం పిళ్లై కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఢిల్లీ స్పెషల్ కోర్టు పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. మరోవైపు కవితను ప్రస్తుతం ఈడీ అధికారులు ఒంటరిగా విచారిస్తున్నారు.
ఒకవైపు కవిత విచారణ కొనసాగుతుండగానే.. తెలంగాణ అదనపు ఏజీ దిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఒకవైపు ఆమె లాయర్లు ఈడీ కార్యాలయానికి వెళ్లడం.. అధికారులు, బీఆర్ఎస్ నేతలు భారీ స్థాయిలో ఈడీ కార్యాలయానికి చేరుకోవడంతో సోమవారం ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుంటారా? లేక విచారణ అనంతరం పంపించేస్తారా? అనే విషయంలో టెన్షన్ నెలకొంది.
ఒకవైపు హైదరాబాద్ లో కవిత విచారణ కొనసాగుతుండాగానే ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారంనాడు పొడిగించింది. సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ఆయనను సీబీఐ హాజరుపరిచింది. దీంతో మరో రెండు వారాలు అతన్ని కస్టడీకి అప్పగించింది.