Viveka Murder Case: నేడు సీబీఐ ముందుకు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి.. విచారణపై సర్వత్రా ఉత్కంఠ!

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ విచారణ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించి ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతుంది. అయితే, ఇప్పటి వరకు సాగిన విచారణలో హైదరాబాద్ కు బదిలీ అయిన తర్వాత సీబీఐ విచారణ ఇద్దరు వ్యక్తుల మీదనే ఫోకస్ పెట్టింది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను ఒకటికి రెండుసార్లు సీబీఐ ఈ కేసులో విచారించడం సస్పెన్స్ పుట్టిస్తుంది.
తాజాగా ఎంపీ అవినాష్ ను మూడవసారి విచారించిన సీబీఐ అధికారులు మరోసారి మళ్ళీ పిలుస్తామని కూడా చెప్పారు. అప్పుడే అవినాష్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం రాగా.. అతను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి ఆ రోజు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే, సోమవారం హైకోర్టులో ఈ కేసు హియరింగ్ ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది సస్పెన్స్ గా కనిపిస్తుంది. అదలా ఉండగానే నేడు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు.
ఈ కేసులో అనుమానితులుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ రెండు రోజుల క్రితం అవినాష్ రిట్ పిటిషన్ సందర్భంలో తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో నేటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలుత భాస్కర్రెడ్డిని ఫిబ్రవరి 23న విచారణకు రావాలని నోటీసులు అందించగా భాస్కర్ రెడ్డి మరోసారికి వాయిదా వేశారు. ఈ నెల 12న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేయగా నేటి విచారణపై ఉత్కంఠ నెలకొంది.
కడప సెంట్రల్ జైలులోని అతిథిగృహంలో సీబీఐ బృందం భాస్కర్రెడ్డిని విచారించనుంది. వివేకా హత్య కేసులో సాక్ష్యాధారాల చెరిపివేత, రూ.40 కోట్ల డీల్పై తండ్రీకొడుకులు భాస్కర్రెడ్డి, అవినాశ్రెడ్డిల ప్రమేయం ఉన్నట్లు సీబీఐ వాదిస్తుంది. హత్య జరిగిన రోజున ఎవరెవరికి ఫోన్లు చేశారు, హత్య జరిగిన రోజు సాక్ష్యాధారాలు ఎందుకు చెరిపారనే దానిపైనే ఎంపీ అవినాష్ రెడ్డిని ఇప్పటికే మూడుసార్లు సీబీఐ సుదీర్ఘంగా విచారించగా.. నేడు ఆయన తండ్రి భాస్కర్రెడ్డిని అవే అంశాలపై విచారించనున్నారు.