Viveka Murder Case: మినహాయింపులు దక్కలే.. మరోసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాష్!

Viveka Murder Case: హాజరవలేనని చెప్పినా సీబీఐ మినహాయింపు ఇవ్వకపోవడంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాష్ మరోసారి సీబీఐ విచారణకు హాజరవ్వాల్సి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ మూడు సార్లు విచారణకి హాజరవగా ఇది నాల్గవసారి. గతంలో జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10న అవినాష్రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు.. ఈరోజు ఉదయం నుండి విచారిస్తున్నారు.
ప్రస్తుతం సీబీఐ ఎస్పీ రామ్సింగ్ నేతృత్వంలో అధికారులు అవినాష్ను విచారిస్తున్నారు. ఎంపీ అవినాష్ ఇప్పటికే తన విచారణపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించగా.. సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. అయితే, అరెస్ట్ చేయోద్దన్న రిట్ పిటిషన్పై మాత్రం తీర్పును హైకోర్టు రిజర్వ్లో ఉంచింది. అవినాష్రెడ్డి సీబీఐ విచారణ సమయంలో వీడియో, ఆడియో రికార్డు కూడా అధికారులు చేయనున్నారు.
ఈ కేసులో విచారణ సరైన మార్గంలో జరగడం లేదని అవినాష్ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని.. తనపై తప్పుడు జరుగుతుందని చెబుతున్నారు. కాగా, ఈరోజు విచారణకు రావాలని సీబీఐ కోరగా.. తనకు పార్లమెంటు సమావేశాలు ఉన్నందున సీబీఐ ముందు హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ సోమవారం సీబీఐకి అవినాష్రెడ్డి లేఖ రాశారు. దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.
ఈరోజు మినహాయింపు కావాలని తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ సందర్భంగా ఎంపీ కోరారు. అయితే మినహాయింపు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సీబీఐ వద్దే తేల్చుకోవాలని సూచించింది. అయితే, రిజర్వ్ లో ఉన్న తీర్పు వెలువరించేదాకా ఆయన్ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఈక్రమంలో మినహాయింపు దక్కకపోవడంతో ఎంపీ అవినాష్ ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో సీబీఐ ఎదుట హాజరుకావాల్సి వచ్చింది. అయితే, ఈ రోజు విచారణలో ఏం జరిగింది? ఏం తేల్చారన్నది చూడాల్సి ఉంది.