Russia-Ukraine War: ఆగని రష్యా-ఉక్రెయిన్ వార్.. ఒక్క రోజులోనే 500 మంది రష్యా సైనికుల మరణం!

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మళ్ళీ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లోని బఖ్ముత్ పట్టణాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ఉక్రెయిన్ బఖ్ముత్ చేజారిపోకుండా పోరాడుతుంది. ఈ నేపథ్యంలో బఖ్ముత్ కేంద్రంగా మారణహోమం జరుగుతోంది. నెలల తరబడి ఈ పట్టణంపై ఆధిపత్యం కనబరిచేందుకు రష్యన్ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తైంది. సైనికచర్య పేరుతో ఉక్రెయిన్ పై రష్యా గతేడాది ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభించింది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు-రష్యా మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఉక్రెయిన్ను యుద్ధక్షేత్రంగా మార్చింది. నిత్యం బాంబుల మోతతో ఈ ప్రాంతం దద్దరిల్లుతుండగా.. వేలాది మంది సైనికులు ప్రాణాలు విడుస్తున్నారు. ఎందరో బాంబు దాడులకు బలవుతుండగా.. అక్కడ అందమైన భారీ భవంతులు శిథిలాలుగా మారుతున్నాయి.
ఏ వీధిలో చూసినా తుపాకీ చప్పుళ్ళు, సైనిక కవాతులే తప్ప ఇంకేమీ లేదు. ఈ ఏడాదిగా యుద్ధం మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ఉక్రెయిన్ లో రష్యా బలగాలు దాదాపుగా చొరబడిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ కి తలమానికమైన బఖ్ముత్ నగరాన్ని ఎలాగైనా రష్యా దక్కించుకోకుండా పోరాడతామని గతంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ ప్రకటించారు. ఈ నగరం ఒక వేళ రష్యా చేతిలోకి వెళ్తే దాదాపుగా యుద్ధం పూర్తయినట్లే.. రష్యా గెలిచినట్లే.
అందుకనే బఖ్ముత్ కోసం ఇరు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బఖ్ముత్ లో జరుగుతున్న పోరాటంలో ఒకే రోజు 500 మందికి పైగా రష్యన్ సైనికులు చంపబడ్డారని ఉక్రెయిన్ వెల్లడించింది. బఖ్ముత్లో 23 ఘర్షణలు జరిగాయని, 24 గంటల వ్యవధిలో రష్యన్లు 16 దాడులకు పాల్పడ్డారని తూర్పు దళాలకు చెందిన సైనిక ప్రతినిధి సెర్హి చెరెవాటీ తెలిపారు. ఈ పోరాటంలో 221 మంది రష్యా సైనికులు మరణించడంతో పాటు 314 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అయితే ఉక్రెయిన్ చేసిన ఈ వ్యాఖ్యలను రష్యా కానీ ఇతర ఏ మీడియా కానీ ధృవీకరించలేదు.