Nara Lokesh: నారా లోకేష్ యువగళం పాదయాత్రకి బ్రేక్.. మార్చి 14 నుండి మళ్ళీ మొదలు!

Kaburulu

Kaburulu Desk

March 11, 2023 | 11:29 PM

Nara Lokesh: నారా లోకేష్ యువగళం పాదయాత్రకి బ్రేక్.. మార్చి 14 నుండి మళ్ళీ మొదలు!

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు లోకేష్ యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 520 కిలోమీటర్ల మేర సాగింది. కాగా, 41 రోజులుగా సాగుతున్న యాత్రలో ఇప్పుడు రెండు రోజుల తాత్కాలిక విరామం ప్రకటించాల్సి వచ్చింది.

ఏపీలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో వుంది. ఈ నేపథ్యంలో లోకేష్ తన యాత్రకు విరామం ప్రకటించారు. మదనపల్లి నియోజకవర్గంలోని కంటేవారిపల్లి బస ప్రాంతం నుంచి ఆయన వెళ్లిపోయినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. పోలీసుల విజ్ఞప్తి మేరకు నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కంటేవారిపల్లి నుంచి ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు.

పాదయాత్ర మొదలైన రోజు నుండి ఇప్పటి వరకు మొత్తం పోలీసులు 22 కేసులు నమోదు చేశారు. కాగా, నేడు తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం నందిరెడ్డివారిపల్లి విడిది కేంద్రం నుంచి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమవగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందంటూ లోకేశ్ కు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆయన ఎన్నికల కోడ్ పై గౌరవం ఉందంటూ పాదయాత్రకు రెండ్రోజులు విరామం ప్రకటించి హైదరాబాద్ బయల్దేరారు.

మళ్లీ 14వ తేదీ నుంచి పాదయాత్ర షురూ చేస్తానని ప్రకటించారు. ఇవాళ్టి పాదయాత్రలో లోకేశ్ ను కురబలు, శాలివాహనులు కలిశారు. వారు తమ సమస్యలను లోకేశ్ కు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఆదుకుంటామని లోకేశ్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాను గుప్పిట్లో పెట్టుకుని .. దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.