Lokesh Yuvagalam Padayatra: పాదయాత్రలో 500 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న నారా లోకేష్!

Kaburulu

Kaburulu Desk

March 9, 2023 | 10:49 PM

Lokesh Yuvagalam Padayatra: పాదయాత్రలో 500 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న నారా లోకేష్!

Lokesh Yuvagalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో మరో మైలురాయిని అధిగమించారు. జనవరి 27 నుంచి నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర నేటితో 500 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ ఘట్టానికి మదనపల్లి వేదికగా నిలిచింది. 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఘట్టంలో ఇది మరో మైలురాయి కావడంతో లోకేశ్ మదనపల్లి సీటీఎం దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

కాగా, యువగళం పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సందర్భంగా పోలీసులు.. లోకేశ్ కాన్వాయ్ లోని 3 వాహనాలను సీజ్ చేశారు. లోకేశ్ బంగారుపాళ్యంలో ప్రవేశించిన సందర్భంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాగా.. లోకేష్ పాదయాత్రలో భాగంగా చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. పవర్ లూమ్ 500 యూనిట్స్ విద్యుత్ ఎత్తేశారని.. వైఎస్సార్ బీమా ఏం చేశారని ప్రశ్నించారు.

చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీ అని పేర్కొన్న ఆయన జగన్ ప్రభుత్వం వచ్చి మైనార్టీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముస్లింలకి ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం, వడ్డీ లేని రుణాలు అందిస్తామని అన్నారు. జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మైనార్టీలను మోసం చేశారని పేర్కొన్న ఆయన మైనార్టీలను ఆర్థికంగానూ, రాజకీయంగానూ ఆదుకున్నది టీడీపీ మాత్రమే అని అన్నారు.

డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ఉన్నా కానీ ముస్లిం సమస్యలు వారికి పట్టవని అన్నారు. లోకేష్ తన పాద‌యాత్ర 500 కి.మీ గుర్తుగా మదనపల్లె నియోజకవర్గంలో ట‌మోటా రైతుల కోసం ట‌మోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటుకి హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ మేరకు హామీలు అమలు చేస్తామని రైతులకు తెలిపారు. దీంతో స్ధానిక టమోటా రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.