BJP-MLC Kavitha: ‘మహిళ గోస-బీజేపీ భరోసా’.. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ దీక్షకి కౌంటర్ గా బీజేపీ మరో దీక్ష!

Kaburulu

Kaburulu Desk

March 9, 2023 | 11:10 PM

BJP-MLC Kavitha: ‘మహిళ గోస-బీజేపీ భరోసా’.. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ దీక్షకి కౌంటర్ గా బీజేపీ మరో దీక్ష!

BJP-MLC Kavitha: తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులతో పాటు.. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరహార దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కవిత పేరు మార్మ్రోగిపోతుంది. ఇప్పటికే కవిత దీక్షకి ఢిల్లీ పోలీసుల నుండి అనుమతి కూడా లభించడంతో హైదరాబాద్ నుండి బీఆర్ఎస్ నేతలు భారీగా ఢిల్లీ చేరుకుంటున్నారు.

నిజానికి ముందుగా పోలీసులు కవిత దీక్షకు అనుమతులు నిరాకరించారు. అయితే భారత్ జాగృతి సంస్థ ప్రతినిధుల సంప్రదింపులు, భారత్ జాగృతి సంస్థ పేరునే అనుమతి కోరడంతో ఢిల్లీ వెస్ట్‌జోన్‌ డీసీపీ దీక్షకు అనుమతి ఇచ్చారు. దీంతో కవిత దీక్ష యథాతథంగా కొనసాగనుంది. పోలీసులు అనుమతి లభించడంతో కవితకు మద్దతుగా హైదరాబాద్ నుండి బీఆర్ఎస్ మహిళా నేతలు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

కాగా, ఎమ్మెల్సీ కవిత దీక్షకు కౌంటర్ గా బీజేపీ మరో దీక్ష చేపట్టబోతుంది. శుక్రవారం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు ఢిల్లీలో బీజేపీ నేతలు నిరసన దీక్షకు సన్నద్ధం అవుతున్నారు. నాంపల్లి కార్యాలయంలో జరగబోయే దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణతో పాటు పార్టీ ముఖ్య నతేలు పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో పెరిగిన బెల్ట్ షాపులకు నిరసనగా ‘మహిళ గోస-బీజేపీ భరోసా’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు.

మరోవైపు ఢిల్లీ బీజేపీ యూనిట్ సైతం శుక్రవారం దీక్ష చేపట్టబోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టాలని మొదట భావించారు. అయితే ఒకే రోజు ఇటు కవిత.. అటు బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాల కోసం దరఖాస్తులు రాగా స్థలం విషయంలో తర్జన భర్జన కొనసాగి.. దీక్ష స్థలాన్ని చెరి కొంత భాగం పంచుకోవాలని పోలీసులు ప్రతిపాదించారు. అందుకు ఒప్పుకోని బీజేపీ నేతలు జంతర్ మంతర్ నుంచి ధర్నా వేదికను దీన్ దయాల్ మార్గ్ కు మార్చుకున్నారు.