Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రత.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!

Kaburulu

Kaburulu Desk

March 7, 2023 | 05:55 PM

Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రత.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!

Earthquake: భూకంపం.. ఈ మాట వింటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల వెన్నులో వణుకు పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.. టర్కీలో సంభవించిన భూకంపంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ఆ తర్వాత వరుసగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. టర్కీలో భూకంపం తర్వాత భారత్‌లోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.

సోమవారమే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కూడా భూమి కంపించింది. జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఉలిక్కిపడిన జనం ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఇళ్లకు, సిమెంట్ రోడ్లకు పగుళ్లు వచ్చాయి. ఇదిలా ఉండగానే మంగళవారం ఫిలిప్పీన్స్ ద‌క్షిణ‌భాగంలో భారీ భూకంపం సంభ‌వించింది. రాజధాని మనీలా కూడా భూకంప ప్రభావానికి గురైంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.0గా నమోదైంది.

దాదాపు అర నిమిషం పాటు భూమి కంపించింది. భూకంప కేంద్రం మిండానావో ఐలాండ్ లోని దావో డిఓరో ప్రావిన్స్ లో 38.6 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఫిలిప్పీన్స్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

అంతకుముందు ఫిబ్రవరి 16న మస్బేట్ ప్రాంతంలో కూడా 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇందులో ఎలాంటి నష్టం జరగలేదు. మంగళవారం నాటి భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరిగినట్లు ఇంకా నిర్ధారించలేదు. భూకంపం సంభవించిన ఫిలిప్పీన్స్ పసిఫిక్‌లోని రింగ్ ఆఫ్ ఫైర్‌ ప్రాంతం చాలా సున్నితమైంది. అందుకే, దీని ప్రభావంపై గ్రామీణ ప్రాంతాల్లోనూ విచారణ చేస్తున్నారు. కాగా, భూకంపం కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.