Kurnool Murder: మరో దారుణం.. ప్రేయసిని వేధిస్తున్నాడని స్నేహితుడిని హతమార్చిన ప్రేమికుడు!

Kaburulu

Kaburulu Desk

March 2, 2023 | 12:54 PM

Kurnool Murder: మరో దారుణం.. ప్రేయసిని వేధిస్తున్నాడని స్నేహితుడిని హతమార్చిన ప్రేమికుడు!

Kurnool Murder: హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో నవీన్ అనే యువకుడిని స్నేహితుడు హరిహరకృష్ణ అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా హత్యచేసిన ఘటన యావత్ దేశం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అది, దర్యాప్తు సాగుతూ కొత్త కొత్త నిజాలు వెలుగులోకి వస్తుండగానే తెలుగు రాష్ట్రాలలో మరో హత్య వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో కూడా స్నేహితుడే నిందితుడు కావడం విశేషం.

తాలుకా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎర్రబురుజుకు చెందిన మురళీకృష్ణ జనవరిలో కనిపించకుండా పోయాడు. కాగా, మురళీకృష్ణను అతని స్నేహితుడు దినేష్‌, మరొకరి సహాయంతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ మేరకు మురళీకృష్ణ హత్య కేసులో నిందితులైన ఎరుకలి దినేష్‌(బాలాజీ నగర్‌), కిరణ్‌(వెంకన్నబావి)ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. సీఐ రామలింగమయ్య హత్య కేసు వివరాలను వెల్లడించారు.

ఫిబ్రవరి 16వ తేదీన మురళీకృష్ణ తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించడం లేదని తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో దినేష్‌పై అనుమానం మొదలై అదుపులోకి తీసుకొని విచారించారు. మరోవైపు సెల్‌ఫోన్ నెంబర్‌ ఆధారంగా విచారించారు. రెండు వైపులా దినేష్ నిందితుడేనని తెలగా దినేష్ కూడా అంగీకరించాడు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌కు ఆదేశించింది.

దినేష్ కుమార్ ఫోన్ నుండి తన ప్రియురాలి నగ్న వీడియోలను మురళీకృష్ణ షేర్ చేసుకొని తన కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్ చేసినట్టుగా గుర్తించారు. ప్రియురాలిని వేధించాడని కక్ష పెంచుకున్న దినేష్.. జనవరి 25వ తేదీన మురళీకృష్ణను పంచలింగాల దగ్గరకు తీసుకుకెళ్ళి ప్లాన్‌ ప్రకారం కత్తితో గుండెలపై పొడిచి హత్య చేశాడు. ఈ హత్య కోసం దినేష్ కుమార్ తన స్నేహితుడు కిరణ్ కుమార్ సాయం తీసుకున్నాడు. హత్య తర్వాత
మృతదేహాన్ని నగర శివారులోని హంద్రీనీవా కాలువలో పడేశారు. కాగా, ఇప్పుడు నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహం కోసం హంద్రీనీవా కాలువలో 10 కిలోమీటర్ల మేర గాలించినా దొరకలేదు.