Viveka Murder Case: ఇంకెన్నాళ్లు సాగదీస్తారు.. వివేకానందా రెడ్డి హత్యకేసుపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

Kaburulu

Kaburulu Desk

March 27, 2023 | 03:04 PM

Viveka Murder Case: ఇంకెన్నాళ్లు సాగదీస్తారు.. వివేకానందా రెడ్డి హత్యకేసుపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

Viveka Murder Case: సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఈ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు మాత్రం అంతకంతకు ఆలస్యం అవుతుంది. ఈ నాలుగేళ్లలో కరోనాతో పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సీబీఐ.. ఇప్పటికీ దర్యాప్తును కొలిక్కి తీసుకురాలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇంకా ఎంతకాలం విచారిస్తారని.. సీబీఐపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ హత్యకు గల ప్రధాన కారణాలను.. ఉద్దేశాలను బయటపెట్టాలని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో కీలక విచారణాధికారిని మార్చడమో.. లేదా ఇంకొక అధికారిని నియమించడమో ఏదో ఒకటి చేయండి అంటూ సుప్రీం అసహానం వ్యక్తం చేసింది. సీబీఐ దాఖలు చేసిన సీల్డ్‌ కవర్‌ నివేదిక ఆసాంతం చదివామని.. కేసు అంతా రాజకీయ శత్రుత్వంతో జరిగిందని రిపోర్ట్‌లో రాశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. మెరిట్స్‌ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

సీబీఐ డైరెక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని పేర్కొన్న ధర్మాసనం కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు వేగంగా సాగడం లేదని.. దర్యాప్తు అధికారిని మార్చాలని కోరుతూ.. ఈ హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై గత సోమవారం (మార్చి20న) సుప్రీంకోర్టు విచారించింది. దర్యాప్తు పురోగతిపై సీల్డ్‌ కవర్‌లో నివేదిక అందించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు అధికారి సరిగానే విచారణ చేస్తున్నారని గత వారం సుప్రీంకోర్టుకు సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ తెలిపారు. కాగా, ఈ రోజు సీబీఐ నివేదికతో విచారించిన సుప్రీం ఈ కేసు స్టేటస్ రిపోర్ట్ లో ఎలాంటి పురోగతి లేదని, దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించింది. అలాగే విచారణ అధికారి రాంసింగ్ ను మార్చివేయాలని జస్టిస్ ఎం ఆర్ షా సిబిఐకి సూచించారు.