Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలలో మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు.. ఈనెల 8న ప్రారంభించే ఛాన్స్!

Vande Bharat Express: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ రైలుకు మరో రైలు జత కానుంది. వచ్చే నెలలో సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలును ఏప్రిల్ 8న ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీ మధ్య సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు నడుస్తోంది. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
సికింద్రాబాద్-తిరుపతి మార్గంలోనూ ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తిరుమల వెంకన్న దర్శనం కోసం తెలంగాణ నుండి భారీ సంఖ్యలో రోజూ భక్తులు వస్తుంటారు. వందేభారత్ రైలు రాకతో తిరుపతి వెళ్లేవారికి మరింత ఉపయోగకరంగా ఉండనుంది. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా నడపనున్నారు. ఈ రైలు ఆగే స్టేషన్లు, చార్జీలు, ప్రయాణ వేళలు వంటి అంశాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
ఈ రైలును వరంగల్, ఖాజీపేట మార్గంలో నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నప్పటికీ.. ఆ మార్గంలో దూరం ఎక్కువ కానుండడంతో బీబీనగర్- నడికుడి మధ్య సికింద్రాబాద్-తిరుపతి మధ్య ట్రాఫిక్ సాధారణంగా ఉంటుంది. ఈ మార్గంలో వందే భారత్ రైలు ప్రవేశపెడితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు వారంలో ఒక్కరోజు మినహా మిగిలిన అన్ని రోజులు అందుబాటులో ఉండనుంది.
ఈ మార్గంలో రైలు గంటకు 130 నుంచి 150 కి.మీ వేగంతో ప్రయాణించేలా ట్రాక్ ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్గంలో వందే భారత్ రైలు టికెట్ ధర రూ.1150 నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. ఈ మార్గంలో సికింద్రాబాద్-తిరుపతి మధ్య నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ కూడా నడుస్తోంది. ఈ రైలు ప్రయాణ సమయం 12 గంటలు. అయితే వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే 6 నుంచి 7 గంటల్లో తిరుపతికి వెళ్లవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రైలు ఏ స్టేషన్లలో ఆగుతుందనే దానిపై స్పష్టతలేదు. గుంటూరు, నెల్లూరులో ఆగుతుందని తెలుస్తోంది.