TDP-YSRCP: నేడు వల్లభనేని వంశీ గడప గడపకు కార్యక్రమం.. గన్నవరంలో టెన్షన్ టెన్షన్!

TDP-YSRCP: కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య ఘర్షణ నేపథ్యంలో హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వంశీ వ్యక్తిగతంగా విమర్శించారు. దీనిపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వంశీపై విమర్శలు గుప్పించారు.
దీంతో ఆగ్రహించిన వంశీ అనుచరులు సోమవారం టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం ఆవరణలో ఉన్న కారుకు నిప్పు పెట్టడంతోపాటు కార్యాలయంలోని సామగ్రి, కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను వైస్సార్సీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీ కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు.
ఈ ఘటనపై కృష్ణా జిల్లా టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ నేతలు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ కూడా రాశారు. నిన్న జరిగిన ఘటనలో దోషులను తేల్చాలని కోరారు. అయితే, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రం నేడు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ చేపట్టిన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నారు.
నిన్న వంశీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతుండగానే వంశీ ఈరోజు గడప గడపకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే నేడు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది టెన్షన్ గా మారింది. ఒకవైపు టీడీపీ శ్రేణుల ఆగ్రహావేశాలు, మరోవైపు ఎమ్మెల్యే వంశీ గడప గడపకి కార్యక్రమం.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గన్నవరంలో ఉత్కంఠగా మారింది.