Sri Krishnadevaraya University: యూనివర్సిటీలో మహా మృత్యుంజయ హోమం.. సర్క్యులర్ తో వివాదం

Kaburulu

Kaburulu Desk

February 20, 2023 | 11:30 PM

Sri Krishnadevaraya University: యూనివర్సిటీలో మహా మృత్యుంజయ హోమం.. సర్క్యులర్ తో వివాదం

Sri Krishnadevaraya University: అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థులు, ఉద్యోగుల సంక్షేమం కోసం మృత్యుంజయ హోమానికి సన్నాహాలు చేయడం, దానికి ఖర్చుల కోసం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ డబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఏకంగా ఒక సర్కులర్ జారీ చేయడం కలకలం రేపుతోంది. ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమం కోసం ఈ నెల 24న విశ్వవిద్యాలయంలో ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమం చేయాలని వైస్‌ చాన్సలర్‌ నిర్ణయించారు.

ఈ మేరకు హోమంలో ఉద్యోగులు స్వచ్ఛంగా పాల్గొనవచ్చని, చందా చెల్లించాలని వీసీ సర్క్యులర్‌ జారీచేశారు. హోమం కోసం బోధనా సిబ్బంది రూ.500, బోధనేతర సిబ్బంది రూ.100 చెల్లించాలని, అంతకు తక్కువగా ఇవ్వొద్దని అందులో పేర్కొన్నారు. దీనికోసం ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, నాన్‌టింగ్‌ స్టాఫ్‌ సంఘం కార్యదర్శిని నియమించడం గమనార్హం. అయితే ఈ ఉత్తర్వులపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

యూనివర్సిటీలు ఉన్నది విద్యార్థులకు చదువు చెప్పడానికా, హోమాలు చేయడానికా అని పలు విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నారు. మృత్యుంజయ హోమం చేయాలని వీసీ తీసుకున్న నిర్ణయాన్ని, అందుకోసం చందాలు అడగడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. విశ్వ విద్యాలయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సబబు కాదని, ఈ నిర్ణయాన్ని వీసీ, రిజిస్ట్రార్ వెనక్కితీసుకోవాలని స్పష్టం చేశారు. హోమాలు, యాగాలు, శాంతి పూజలు చేయడానికి బదులు వర్సిటీ అభివృద్ధిపై దృష్టి సారించాలని మండిపడ్డారు.

ఎస్కేయూలో ఇటీవల కాలంలో దాదాపు 25 మంది వివిధ కారణాలతో చనిపోగా.. అందుకే వర్సిటీలో మృత్యుంజయ హోమం నిర్వహించాలని నిర్ణయించిందని, ఖర్చుల కోసం డబ్బులు చెల్లించాలని సర్కులర్ జారీ చేసిందని విద్యార్థులు వెల్లడిస్తుండగా.. యూనివర్సిటీలలో ఇలాంటి చాదస్తపు పనులు ఏంటని పలు విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీసీ సర్క్యులర్ ప్రకారం మరో నాలుగు రోజులలో హోమం జరగనుండగా.. ఈలోపు అధికారులు స్పందిస్తారా? ఇది ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని ఆసక్తిగా మారింది.