Krishna District: టీడీపీ VS కొడాలి.. ‘ఎన్టీఆర్’ కోసం చితగొట్టేసుకున్నారు!
![Krishna District: టీడీపీ VS కొడాలి.. ‘ఎన్టీఆర్’ కోసం చితగొట్టేసుకున్నారు!](https://kaburulu.com/wp-content/uploads/2023/01/krishna-district.jpg)
Krishna District: ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఓ అంశం ఎప్పటికప్పుడు హీట్ పుట్టిస్తుంది. అదేమిటంటే ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ కు వారసుడు చంద్రబాబు కానేకాదని.. తామే అసలైన వారసులమని కొడాలి నానీ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు హీట్ పుట్టించే కామెంట్స్ చేసే సంగతి తెలిసిందే. ఇక.. ఎన్టీఆర్ కుటుంబం ఎంత కాదన్నా ఎన్టీఆర్ కు రెండో భార్య లక్ష్మి పార్వతి కూడా ఇప్పుడు వైసీపీలోనే ఉన్న సంగతి తెలిసిందే.
దీంతో ఎన్టీఆర్ పేరుతో ఎప్పటికప్పుడు టీడీపీ, చంద్రబాబులపై వైసీపీలో ఓ వర్గం స్పెషల్ అటాక్ చేస్తుంది. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సమయాలలో అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబును ఓ రాక్షసుడిలా చూపించే ప్రయత్నం చేసే వైసీపీలో ఎన్టీఆర్ అభిమానులుగా చెప్పుకొనే వారు.. ఎక్కడికక్కడ సెలబ్రేషన్స్ కూడా చేస్తుంటారు. అటు టీడీపీ, ఇటు వైసీపీలో ఎన్టీఆర్ అభిమాన వర్గం వేడుకలలో అప్పుడప్పుడు గొడవలు కూడా చోటు చేసుకుంటుంటాయి.
కాగా.. ఈసారి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలలో అయితే ఏకంగా చితగొట్టేసుకున్నారు. మాజీ మంత్రి కొడాలి నానీ ఇలాఖా గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని టీడీపీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. టీడీపీ నేత వేనిగండ్ల రాము, పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదానం, భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించారు. మరోపక్క ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ‘ఎన్టీఆర్ ఫ్యాన్స్’ పేరుతో కొడాలి నాని అనుచరులు కూడా బైక్ ర్యాలీని చేపట్టారు.
కొడాలి వర్గాన్ని టీడీపీ నాయకలు అడ్డుకోగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. అది చివరికి తీవ్ర దాడికి దారితీయగా.. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కాసేపటికే మళ్ళీ టీడీపీ కార్యకర్త చెల్లుబోయిన అనిల్పై నాని అనుచరులు దాడి చేయగా.. మళ్ళీ రెండు వర్గాలు చితగొట్టుకున్నారు. అలా మొత్తానికి గుడివాడలో చోటు చేసుకున్న తాజా ఘటనతో పోలీసులు 144 సెక్షన్ విధించారు.