Gannavaram Riots: టీడీపీ నేత పట్టాభి గాయాలతో గన్నవరం కోర్టుకు హాజరు.. 14 రోజుల రిమాండ్!

Kaburulu

Kaburulu Desk

February 21, 2023 | 11:07 PM

Gannavaram Riots: టీడీపీ నేత పట్టాభి గాయాలతో గన్నవరం కోర్టుకు హాజరు.. 14 రోజుల రిమాండ్!

Gannavaram Riots: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ ఆఫీసు దహనం ఘటన రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్న కారణం, చంద్రబాబుపై వంశీ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతల కౌంటర్ విమర్శలతో వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న హింసకు కారణమయ్యారనే ఆరోపణలతో విజయవాడ టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్న పట్టాభిని మంగళవారం మధ్యాహ్నానికి కానీ గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకురాలేదు. మధ్యాహ్నం గన్నవరం పీఎస్ కు తీసుకొచ్చిన పోలీసులు.. అనంతరం సాయంత్రం స్ధానిక కోర్టులో ఆయన అరెస్టు చూపారు. గన్నవరంలో నిన్న చోటు చేసుకున్న హింసకు ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఎస్పీ జాషువా ఇప్పటికే ప్రకటించగా.. ఆయనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు చేసి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

గన్నవరం కోర్టులో హాజరుపర్చేందుకు పీఎస్ నుంచి తరలించే క్రమంలో పట్టాభి శరీరంపై గాయాలు కనిపించాయి. వాటిని పోలీసు వ్యాన్ లో నుంచే మీడియాకు ఆయన చూపించారు. దీనిపై స్పందించిన ఆయన భార్య చందన.. తన భర్తను బాగా హింసించారని ఆరోపించారు. పోలీసుల సహకారంతోనే ఇదంతా జరిగిందన్నారు. తోట్ల వల్లూరు పీఎస్‍లో తన భర్ పట్టాభిని ముసుగేసి ముగ్గురు కొట్టారని చందన ఆరోపించారు. తన భర్తకు ప్రాణహాని ఉందని మొదటినుంచి చెప్తున్నట్లు ఆమె తెలిపారు.

కోర్టులో కూడా పట్టాభి స్పందిస్తూ, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని న్యాయమూర్తికి తెలిపారు. తోట్లవల్లూరు పీఎస్ లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వెల్లడించారు. పీఎస్ లో అడుగుపెట్టేసరికి అక్కడంతా చీకటిగా ఉందని.. ముసుగువేసుకుని ముగ్గురు వ్యక్తులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి, తనను వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారని పట్టాభి వివరించారు. అరికాళ్లు, అరచేతులపై తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తికి తెలిపారు. వాదనలు విన్న అనంతరం పట్టాభి, తదితరులకు రెండు వారాల రిమాండ్ విధించారు. పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.