Viveka Murder Case: సోమవారం విచారణకి రాలేనన్న ఎంపీ అవినాష్.. తప్పదు రావాల్సిందేనన్న సీబీఐ!

Viveka Murder Case: వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తుంది. ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రెండుసార్లు విచారించిన సీబీఐ అధికారులు మూడో సారి విచారణకి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న హైదరాబద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని రెండు రోజుల క్రిందట సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఎంపి అవినాష్ తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు హజరు కావాలని కోరింది.
అయితే, 6వ తేదీ సోమవారం తాను విచారణకు హాజరు కాలేనని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడించారు. దీనికి సీబీఐ.. ఛాన్స్ లేదు.. తప్పకుండా సోమవారం విచారణకు హాజరు కావాల్సిందేనని.. పులివెందులలోని ఎంపీ ఇంటికి శనివారం రాత్రి వెళ్ళి మరీ సమాచారం ఇచ్చింది. దీంతో ఎంపీ సోమవారం విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. మరి అవినాష్ సోమవారం విచారణకు వస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న విచారణకు హాజరుకావాల్సిందిగా భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు మొదట నోటీసులు జారీచేయగా.. తాజాగా ఈ నెల 6వ తేదీనే ఆయనను కూడా విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులకు సూచించారు. కడపలోనే విచారణకు హాజరుకావాల్సిందిగా ఆయనకు తెలిపారు.
ఈ కేసులో సీబీఐ ఇప్పటికే రెండుసార్లు అవినాష్ రెడ్డిని విచారించగా హత్య కేసులోని కీలక పరిణామాలపై ఆయనను లోతుగా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. హత్య జరిగిన సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్ లొకేషన్ ఘటనా స్థలంలో చూపించినట్లు గూగుల్ టేకౌట్ అనే అప్లికేషన్ ద్వారా సీబీఐ గుర్తించింది. దీంతో హత్య జరిగిన సమయంలో అక్కడ ఎందుకు ఉన్నారు? ఏం చేశారు? హత్యలో పాత్ర ఏమైనా ఉందా? అనే ప్రశ్నలపై సీబీఐ ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరి రేపు సోమవారం విచారణలో సీబీఐ ఏం తేల్చనుందో చూడాలి.