Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు బెయిల్!

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా రాజకీయాలలో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్నో మలుపులు… కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ మద్యం స్కామ్లో కీలక వ్యక్తులు అరెస్టు కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును కూడా ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీ మద్యం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. బుచ్చిబాబుకు బెయిల్ ఇవ్వడం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. బుచ్చిబాబుకు బెయిల్ ఇస్తూ.. సోమవారం ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గోరంట్ల బుచ్చిబాబును ఫిబ్రవరి 8న సీబీఐ అరెస్ట్ చేయగా.. తొలుత మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. ఆ తర్వాత బుచ్చిబాబుకు 14 రోజుల కస్టడీని పొడగించారు. ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీ పొడిగించాలని సీబీఐ.. కోర్టును కోరగా సీబీఐ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు కస్టడీని పెంచింది. ఈ విషయంపై తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, ఇప్పుడు మంజూరైన ఈ బెయిల్ నిబంధనలతో కూడినట్లు ఉంటుందని స్పష్టం చేసింది. పాస్పోర్టు జమ చేయాలని, రూ.2 లక్షల పూచీకత్తు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్.ఐ.ఆర్లో 14వ నిందితుడిగా ఉన్న మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లైకి బుచ్చిబాబు చార్టెడ్ అకౌంటెంట్గా వ్యవహరించగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా ఆడిటర్గా పనిచేశారు. దీంతో ఈ కేసు మలుపులు తిరిగింది.