Anantapur: అనంతపురంలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకి దారితీసిన సోషల్ మీడియా!

Kaburulu

Kaburulu Desk

March 6, 2023 | 11:45 PM

Anantapur: అనంతపురంలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకి దారితీసిన సోషల్ మీడియా!

Anantapur: అనంతపురం పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ మద్దతుదారులు విసురుకున్న సవాళ్లు, ప్రతి సవాళ్ల కారణంగా ఇక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. గత కొన్ని రోజుల నుంచి వైసీపీ, టీడీపీ సోషల్ మీడియా ఫాలోవర్ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మద్దతుదారుడు హరికృష్ణారెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన అజయ్ ల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం సాగింది.

వీరిద్దరు సోషల్ మీడియా వేదిక అనంతపురం జిల్లా రాప్తాడు రాజకీయాల గురించి తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగించారు. పరిటాల కుటుంబాన్ని ఎవరైన విమర్శించాలంటే.. దమ్ముంటే రాప్తాడు వచ్చి మాట్లాడాలని టీడీపీ మద్దతుదారులు సవాళ్లు విసిరారు. దీంతో వారి సవాళ్ల స్వీకరించిన వైసీపీ మద్దతుదారుడు హరికృష్ణ.. అనంతపురం క్లాక్ టవర్ వద్దకు వచ్చి.. పరిటాల కుటుంబం చేసిన అన్యాయాలను, అవినీతిని బయటపెడతానంటూ కౌంటర్ ఇచ్చాడు.

ఈ క్రమంలోనే అనంతపురం క్లాక్ టవర్ వద్దకు టీడీపీ, వైసీపీకి చెందిన మద్దతుదారులు చేరుకున్నారు. ఇరువర్గాలు వారి వారి నాయకులకు మద్దతుగా నినాదాలు చేసుకుంటూ ఘర్షణకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుక ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఓ పోలీసుతో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఇక, ఇరువర్గాలకు చెందినవారికి అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. అయితే టీడీపీ శ్రేణులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అనవసరంగా కవ్వింపు చర్యలకు పాల్పడిన వైసిపి నాయకులను వదలి అక్రమంగా టిడిపి నేతలను అరెస్టు చేసి, బెదిరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి ఉద్రిక్తలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తామని డీఎస్పీ ప్రసాద్‌ రెడ్డి తెలిపారు.