AP MLC Elections: రేపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీడీపీ, వైసీపీ రెబల్స్ ఓట్ల చుట్టూ రాజకీయం!

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 10:00 PM

AP MLC Elections: రేపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీడీపీ, వైసీపీ రెబల్స్ ఓట్ల చుట్టూ రాజకీయం!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక పూర్తి కాగా.. మూడింట మూడు పట్టభద్రులను టీడీపీ కైవసం చేసుకొని అధికార పార్టీ వైసీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల చుట్టూ రాజకీయం మొదలైంది. గురువారం (మార్చి 23)న రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

మొత్తం 7 స్థానాల కోసం జరిగే ఈ ఎన్నికలలో 8 మంది బరిలో ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా జరిగే ఈ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నిజానికి ఈ ఎన్నికలలో టీడీపీకి సంఖ్యాబలం అనుకూలంగా లేనప్పటికీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బరిలో దిగింది. దీంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. టీడీపీ తమ అభ్యర్థిగా మహిళా నేత పంచుమర్తితో అనురాధతో పోటీ చేయిస్తోంది. దీంతో రేపు అసెంబ్లీలో ఏం జరగబోతుందన్న ఆసక్తి మొదలైంది.

ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక స్థానం గెలవాలంటే తప్పనిసరిగా 22 ఓట్లు కావాలి. అయితే, టీడీపీకి ప్రస్తుత బలం 19 అనే చెప్పుకోవాలి. టీడీపీ గత ఎన్నికల్లో 23 సీట్లు గెలవగా, వారిలో ఇప్పుడు నలుగురు వైసీపీ పక్షాన ఉన్నారు. టీడీపీ నుండి గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్‌, మద్దాల గిరి ఇప్పుడు వైసీపీ పంచన చేరారు. ఈ లెక్కన చూస్తే టీడీపీ అభ్యర్థి గెలుపుకి మరో మూడు ఓట్లు కావాలి. అదే సమయంలో వైసీపీకి 7 స్థానాలు గెలవాలంటే 154 ఓట్లు కావాలి.

అయితే, వైసీపీ గత ఎన్నికలలో 151 స్థానాలు గెలుచుకోగా.. వైసీపీలో కూడా రెబల్స్ ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసి రెబల్స్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ ఓట్లు ఎటువైపు పడనున్నాయన్నది ఆసక్తిగా మారింది. అదే సమయంలో రెండు పార్టీలు విప్ జారీ చేసే ఈ రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. మరి ఏం జరగనుందో అసెంబ్లీలోనే చూడాలి.