TDP: సైకిలెక్కిన కన్నా.. చేరిక సభలో చంద్రబాబు జగన్ పై ఫుల్ జోష్ విమర్శలు!

TDP: ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయవేత్త, కాపు సామాజికవర్గంలో బలమైన నేత కన్నా లక్ష్మీనారాయణ ఊహించినట్లే టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన కుమారుడు, గుంటూరు మాజీ మేయర్ నాగరాజు కూడా టీడీపీలో చేరారు. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు 3 వేల మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది.
టీడీపీలో చేరిక నిమిత్తం గుంటూరులోని తన నివాసం నుంచి కన్నా లక్ష్మీనారాయణ భారీ వాహన ర్యాలీతో టీడీపీ ఆఫీసుకు వచ్చారు. రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారం నచ్చక కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు కన్నా చేరికతో టీడీపీ మరింత బలపడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కన్నాతో పాటు వచ్చిన నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పార్టీ కండువాలు కప్పుతూ ఆహ్వానించి ఉత్సాహంగా కనిపించారు.
అదే ఉత్సాహంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల బాణాలు సంధించారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కొందరు పోలీసులు జగన్ కు పావులుగా మారారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఐపీసీ చట్టం లేదు.. వైసీపీ చట్టం ఉందని విమర్శించారు. అధికారానికి అడ్డం వచ్చినందుకే బాబాయ్ వివేకాను హత్య చేశారని, షర్మిలకు ఎంపీ సీటు కోసం పట్టుబట్టినందుకే అడ్డుతొలగించుకున్నారని.. హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అని అఫిడవిట్ లో స్పష్టంగా చెప్పారని కౌంటర్లు వేశారు.
వివేకా హత్య జరిగిన తర్వాత నారాసుర రక్తచరిత్ర అని పేపర్లో వేసుకున్నారు. సీబీఐ విచారణ కావాలని అడిగాడు. కానీ గూగుల్ టేక్ ఔట్ లాంటి టెక్నాలజీ వస్తుందని, దానికి తాను తగులుకుంటానని జగన్ ఊహించి ఉండడు. గూగుల్ అంకుల్ ని అడిగితే చాలు.. అన్ని వివరాలను మన ముందుంచుతుందని ఎద్దేవా చేశారు. ఎవడేం చేసిందీ గూగుల్ అంకుల్ ని అడిగితే సరిపోతుందని చెబుతుంటాను. ఇప్పుడా గూగుల్ టేక్ ఔట్ స్పష్టంగా వివరించింది. కోడికత్తి కమల్ హాసన్ డ్రామాలు ఆడాడని.. ఓ సినిమా తీయాలన్నా అసలు ఇలాంటి స్టోరీని ఎవరూ ఊహించలేరని ఎద్దేవా చేశారు.