KTR: మీరు ఇటుకలతో కొడితే.. మా కార్యకర్తలు బండరాళ్లతో కొడతారు జాగ్రత్త.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు!

KTR: తెలంగాణలో ఎన్నికల వేడి ఎప్పుడో మొదలైంది. ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ అన్ని పార్టీలు వ్యూహాలకు పదులు పెడుతున్నాయి. విమర్శలలో పదును కూడా పెరిగింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల నేతలు ప్రజల మధ్యకి వెళ్తూ.. విపక్షాలపై మాటల దాడి చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో బీఆర్ఎస్ నేతలు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రజల మధ్యకి వెళ్తూ ప్రతిపక్షాలను తూర్పార పట్టేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ బుధవారం భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్క చాన్స్ అంటూ తిరుగుతున్నాడని, 75 ఏళ్ల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ కు ఒక్కటి కాదు పది అవకాశాలు ఇచ్చారని.. అప్పుడేం చేశారని ప్రశ్నించారు. మళ్లీ ఇప్పుడు ఆ దిక్కుమాలిన పాలన కావాలా? అని ప్రజలనుద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
అంతేకాదు, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరికపై స్పందించిన మంత్రి కేటీఆర్.. 12 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి లోబడే నాడు టీఆర్ఎస్ లో చేరారని.. అప్పుడు కాంగ్రెస్ నేతలు ఇటుకలతో కొడతామంటున్నారు. మీరు ఇటుకలతో కొడితే మా కార్యకర్తలు బండరాళ్లతో కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. జాగ్రత్త.. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.
ఇక, కర్ణాటక బీజేపీ నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలనే కర్ణాటకలోనూ అమలు చేయాలని కోరుతున్నారని, తెలంగాణ పథకాలు కర్ణాటకలో అమలుచేయలేకపోతే తమ నియోజవర్గాలను కూడా తెలంగాణలో కలిపేయాలని కోరుతున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలపై ఓర్వలేకనే బీజేపీ నేతలు ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.