Marriage In ICU: ఆసుపత్రిలో వధువు.. ఐసీయూలో పెళ్లి.. బెడ్ పైనే మూడు ముళ్ళు!

Kaburulu

Kaburulu Desk

February 24, 2023 | 09:01 AM

Marriage In ICU: ఆసుపత్రిలో వధువు.. ఐసీయూలో పెళ్లి.. బెడ్ పైనే మూడు ముళ్ళు!

Marriage In ICU: పెద్దలంతా కూర్చొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేందుకు ముందుగా ముహుర్తాలు పెట్టుకున్నారు. అయితే, ఆ సమయానికి వధువు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. అయితే, ముందుగా అనుకున్నట్లే ఐసీయూలోనే పెళ్లి చేశారు. ఆసుపత్రి బెడ్ మీద ఉన్న వధువు మెడలో తాళి కట్టి వరుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ విచిత్ర ఘటన మన తెలుగు రాష్ట్రాలలో జరగడం విశేషం.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో ఈ విచిత్ర పెళ్లి జరిగింది. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన వధువును ఆసుప బెడ్‌పైనే యువకుడు పెళ్లి చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆసుపత్రి బెడ్‌పై ఉన్న వధువుకు తాళి కట్టాడు వరుడు. ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగి చికిత్స పొందుతున్న వధువుకు ఆసుపత్రిలోనే తాళి కట్టాడు. అది కూడా ఐసీయూలోని బెడ్‌పైనే తాళి కట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి ముందుగా వివాహాన్ని నిశ్చయించారు. ముహూర్తం ప్రకారం గురువారం వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ, ఒక రోజు ముందు.. అంటే బుధవారం రోజున వధువు అస్వస్థత గురైంది. దీంతో కుటుంబ సభ్యులు వధువును మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి చేర్పించారు. ఆమెని పరీక్షించిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ కూడా చేశారు.

ముందుగా అనుకున్న ముహూర్తం సమయానికి వధువు ఆసుపత్రిలోనే ఉండడంతో బెడ్‌పైనే పెళ్లి నిర్వ హించడానికి పెద్దలు పూనుకున్నారు. దీంతో వరుడు ఆసుపత్రిలోనే పెళ్లిచేసుకున్నాడు. ఐసీయూలో బెడ్ మీద ఉన్న వధువు శైలజకి అక్కడే తాళి కట్టి భార్యను చేసుకున్నాడు. అందరి ముందు దండలు మార్చుకుని ఈ జంట ఒక్కటైంది. సంప్రదాయం ప్రకారం.. బెడ్‌పైనే ఉన్న వధువుకు మెట్టలు పెట్టించారు.. అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరి తరపు బంధువులు వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు.