Sri Chaitanya College: ఇంటర్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య.. లెక్చరర్స్ పెట్టే ఒత్తిడి తట్టుకోలేకనేనా?

Kaburulu

Kaburulu Desk

March 1, 2023 | 11:29 AM

Sri Chaitanya College: ఇంటర్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య.. లెక్చరర్స్ పెట్టే ఒత్తిడి తట్టుకోలేకనేనా?

Sri Chaitanya College: మార్చి నెల వచ్చేసింది. అకడమిక్ ఇయర్ ముగిసే సమయం ఆసన్నమైంది. అందుకే ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి మొదలవుతుంది. ర్యాంకులు, మార్కుల పోటీలలో కాలేజీల మధ్య ఉండే వైరంతో టీచర్లు, లెక్చరర్లు విద్యార్థులపై తీవ్రంగా ఒత్తిడి పెట్టే సంగతి తెలిసిందే. ఒకవైపు, కాలేజీలలో ర్యాగింగ్, వేధింపులతో ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండగా.. ఇప్పుడు ఇలా లెక్చరర్ల ఒత్తిడి కూడా పిల్లల ఉసురు తీస్తుంది.

హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎన్.సాత్విక్ అనే విద్యార్థి ఆత్మ హత్య చేసుకున్నాడు. రాత్రి 10:30 సమయంలో తన క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెప్తున్నారు. సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలిసి కూడా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని.. తోటి విద్యార్థులే ఓ వెహికల్‌ని లిఫ్ట్ అడిగి, సాత్విక్‌ను ఆసుపత్రికి తరలించగా.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే సాత్విక్ మృతిచెందినట్లు విద్యార్థులు చెప్తున్నారు.

సాత్విక్ చాలా మంచి స్టూడెంట్ అని, అయినా అతడ్ని ‘ఫెయిల్యూర్ ఫెయిల్యూర్’ అంటూ టీచర్లు వేధిస్తూ.. ఎక్కువగా కొట్టేవారని కూడా చెప్పారు. కొందరు లెక్చరర్స్ తమతోపాటు సాత్విక్‌తో కూడా చాలా దారుణంగా ప్రవర్తించేవారని, దాంతో అతడు మెంటల్‌గా డిప్రెస్ అయ్యాడని.. ఆ డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని వెల్లడించారు. అటు.. తమ తనయుడి ఆత్మహత్యతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. గతంలో లెక్చరర్స్ కొట్టడం వల్ల తమ కుమారుడు పదిహేను రోజులపాటు ఆసుపత్రి పాలయ్యాడని.. ఇకపై తనను ఏమీ అనవద్దని గతంలో రిక్వెస్ట్ చేసినా, అతడ్ని మెంటల్ స్ట్రెస్‌కి గురి చేశారన్నారు. కాలేజీ సిబ్బందిలో ఒక్కరు కూడా ఆసుపత్రికి రాలేదని, తమ అబ్బాయి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమని బోరున విలపించారు.