Viveka Murder Case: వివేకా హత్యకేసు.. ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు!

Viveka Murder Case: వైఎస్ఆర్ సోదరుడు, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హీట్ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణకి బదిలీ అయిన తర్వాత దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ.. ఈ కేసులో ఇప్పటికే వివేకా కుటుంబ సభ్యులైన ఎంపీ వైఎస్ అవినాష్ ను రెండుసార్లు విచారించగా.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి రెండుసార్లు నోటీసులు ఇచ్చి ఇప్పటికే ఒకసారి విచారణ జరిపారు.
కాగా, ఇప్పుడు మరోసారి భాస్కర్ రెడ్డిని విచారణకి రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు జారీ చేసింది. పులివెందులలోని భాస్కర్ రెడ్డి ఇంట్లో మంగళవారం సాయంత్రం ఈ నోటీసులను అధికారులు అందజేశారు. ఈ నెల 12న కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరు కావాలని నోటీసులలో సీబీఐ పేర్కొంది. ఈ కేసులో విచారణకు రావాలంటూ గత నెల 18న నోటీసులు జారీ చేయగా.. కొంత సమయం కావాలంటూ భాస్కర్ రెడ్డి కోరారు.
ముందస్తు కార్యక్రమాలతో బిజీగా ఉన్నందు వల్ల విచారణకు రాలేనని చెప్పారు. దీంతో సీబీఐ తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సీబీఐ.. ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లను కూడా విచారించారు. ఈ నేపథ్యంలో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా వైఎస్ భాస్కర్ రెడ్డిని అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివేకా హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని కుట్రదారుడిగా సీబీఐ తేల్చింది. వివేకా హత్య గురించి ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు ముందే తెలుసని సీబీఐ పిటిషన్లో కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసుల్లో కోరారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లేదా హైదరాబాద్లోని సీబీఐ ఆఫీసులో తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.