Vemula Prashanth Reddy: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం అమ్మకానికి పెట్టినా ఏపీలో అడిగే దిక్కు లేదు!

Kaburulu

Kaburulu Desk

March 15, 2023 | 11:06 PM

Vemula Prashanth Reddy: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం అమ్మకానికి పెట్టినా ఏపీలో అడిగే దిక్కు లేదు!

Vemula Prashanth Reddy: టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారిన అనంతరం ఏపీలో కూడా పాగా వేస్తారని.. ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ వలసలు ఉంటాయని భావించిన సంగతి తెలిసిందే. అయితే, ఏమైందో ఏమో కానీ కేసీఆర్ అండ్ కో ఏపీలో పార్టీ కార్యకలాపాలపై కాస్త ఆలోచనలో పడ్డట్లు కనిపించింది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు కూడా కనిపించడం లేదు. తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కూడా ఈ మధ్య ఏపీ గురించి వ్యాఖ్యలు కూడా చేయడం లేదు.

అయితే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం ఈరోజు ఏపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేసినా ఏపీలో అడిగే దిక్కు కూడా లేదని.. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కేంద్రానికి, మోడీకి మద్దతుగానే ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో రాజకీయ పార్టీల పరిస్థితి చాలా విచిత్రంగా ఉందన్న మంత్రి వేముల.. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ రెండు పార్టీల మద్దతు మోడీకే ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ నిలువునా అమ్మకానికి పెట్టినా ఏపీలో అడిగే పరిస్థితే కూడా లేదని విమర్శించారు. అక్కడ అందరూ గంపగుత్తగా మోడీకి జై కొట్టారని కౌంటర్లు వేశారు.

ఏపీలో కూడా ప్రజల పక్షాన పోరాడే కేసీఆర్ వంటి బలమైన నాయకుడు అవసరమని మంత్రి వేముల చెప్పారు. కేసీఆర్ నాయకత్వం కావాలని ఏపీలో కూడా చాలా మంది కోరుకుంటున్నారని.. ఏపీలో అభివృద్ధి గురించి ఆలోచించే వారే లేరని.. అక్కడ కులాల కొట్లాట తప్ప మరేమీ లేదని చెప్పారు. ఈ ఎనిమిది ఏళ్లలో ఏపీలో జరిగింది ఏమీ లేదని విమర్శించారు.