AP Assembly: అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. కోటంరెడ్డిపై బడ్జెట్ సెషన్ మొత్తానికి వేటు!

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మంగళవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. రెండో రోజే సభలో నిరసనలు, ఆందోళనలకు, సస్పెన్షన్స్ చోటుచేసుకున్నాయి. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీరియస్ అయ్యారు. గవర్నర్ విషయంలో కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
సభా సమయం వృథా చేశారంటూ పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును సభ నుంచి సస్పెండ్ చేయాలని బుగ్గన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. స్పీకర్ చదివి వినిపించి వాయిస్ ఓటుతో తీర్మానాన్ని ఆమోదించారు. వారిద్దరినీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో బుగ్గన మరో తీర్మానం ప్రవేశపెట్టగా.. అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా, ఇందులో బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు నిమ్మల, పయ్యావులపై సస్పెన్షన్ అమల్లో ఉండనుండగా.. మిగతా సభ్యులను ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేశామని స్పీకర్ చెప్పారు. కాగా, మరో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆయనపై సెషన్ మొత్తం వేటు వేశారు.
ఈ మేరకు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా.. వాయిస్ ఓటు ద్వారా ఆమోదించి కోటంరెడ్డిని సస్పెండ్ చేసి బయటకి పంపారు. సస్పెన్షన్ తర్వాత మాట్లాడిన కోటంరెడ్డి.. ప్రజా సమస్యలపై గొంతెత్తుతాననే తనకు అవకాశం ఇవ్వలేని మండిపడ్డారు. గాంధీగిరీ పద్ధతిలో నిలబడే నిరసన తెలిపే తన నుండి ప్లకార్డు తీసుకొని చించేశారని, ఇదేంటని అడిగితే సస్పెండ్ చేశారని ఆరోపించారు.