Arrest Warrant: కోర్టు ఆగ్రహం.. మంత్రి గుడివాడ అమర్నాథ్, కొడాలి నానీలకు అరెస్ట్ వారంట్ జారీ!

Arrest Warrant: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి కొడాలి నానీలపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గతంలో 2018 ఏప్రిల్ 11వ తేదీన గుడివాడ అమర్నాథ్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు ప్రత్యేక హోదా రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ లోకి అనధికారికంగా ప్రవేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు పలువురిపై అప్పుడే కేసు నమోదు అయింది. ఈ కేసులో భాగంగా ఫిబ్రవరి 27వ తేదీన మంత్రి గుడివాడ అమర్నాథ్ కోర్టుకు హాజరు కాలేదు. ఈ తరుణంలోనే కోర్టు నాన్ బెయిలబుల్ వారంటూ జారీ చేసింది.
ఈ కేసులో గుడివాడ అమర్నాథ్ తో పాటు వైఎస్సార్సీపీ నేతలు మళ్ల విజయప్రసాద్, కోలా గురువులు, జాన్ వెస్లీ, కొయ్య ప్రసాదరెడ్డి, పీవీ సురేష్, వంశీకృష్ణ యాదవ్, పసుపులేటి ఉషాకిరణ్, గరికిన గౌరి తదితరులు ఉన్నారు. వీరంతా కలిసి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ డిమాండ్ చేస్తూ విశాఖ రైల్వేస్టేషన్లోకి వెళ్లారు. విశాఖ-పలాస ప్యాసింజర్ రైలును నిలిపేసి రైల్ కో నిర్వహించారు. దీంతో వారిపై కేసు నమోదైంది.
వీరిలో గుడివాడ అమర్నాథ్, జాన్ వెస్లీ మినహా నిందితులందరూ ఫిబ్రవరి 27న విచారణకు న్యాయస్థానానికి హాజరయ్యారు. కోర్టు ఆదేశించినప్పటికీ మిగిలిన ఇద్దరూ హాజరుకాకపోవటంతో అమర్నాథ్, జాన్ వెస్లీలకు.. విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ కోసం ఈనెల 7వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇక, మరోకేసులో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానీపై కూడా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. 2016 మే 10న పోలీసు ఉత్తర్వులు లెక్కచేయకుండా కొడాలి నాని, కోలుసు పార్థసారథి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణకు కొడాలి నాని పలుమార్లు హాజరు కాకపోవడంతో నేడు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.