Heavy Rains in Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు.. కుండపోతతో తడిసి ముద్దైన భాగ్యనగరం!

Heavy Rains in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో మూడు రోజులపాటు కూడా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. శని, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కాగా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే వర్షం దంచికొడుతుంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడుతోంది.
హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పటాన్చెరు, రామచంద్రపురం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీస్ ల నుంచి ఇళ్లకు వెళ్తున్న వారు ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అదేవిధంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. ఈదురుగాలుల తాకిడికి పలు రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో వడగాళ్ల వర్షంతో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తుంది. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, బహదూర్పురా, ఫలక్ నుమా, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్, చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్పల్లి, మారేడుపల్లి, ఓయూ క్యాంపస్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.