MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ క్లీన్ స్వీప్.. చంద్రబాబు స్పందన ఇదే!

MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా సాధారణ ఎన్నికల స్థాయిలో ఉత్కంఠ రేపాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరా పోటీ కనిపించింది. అయితే, ఒక్కో రౌండ్ పూర్తవుతుంటే ఫలితాలు ప్రతిపక్ష టీడీపీకి మెజార్టీగా కనిపించింది. ఏపీలో పట్టభద్రులకు జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలలో మూడు టీడీపీ సొంతం చేసుకోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్ తొలి నుండి క్లీట్ కట్ విజయం సాధించగా.. పశ్చిమ రాయలసీమ స్థానంలో మాత్రం శనివారం మధ్యాహ్నం వరకూ కూడా హోరాహోరీగా సాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తేలకపోవడంతో రెండవ ప్రాధాన్యత లెక్కించగా ఒక్కో రౌండ్ టీడీపీకి మెజారిటీ మొదలై ఈ స్థానంలో కూడా టీడీపీ అభ్యర్ధే భారీ మెజార్టీతో గెలుపొందారు.
ఉత్తరాంధ్ర స్థానంలో చిరంజీవిరావు విజయానికి 94,509 ఓట్లు అవసరం కాగా, తొలి ప్రాధాన్యంలో 82,958, రెండో ప్రాధాన్యంలో 11,551 ఓట్లు సాధించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి 1,12,686 ఓట్లు సాధించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7,543 ఓట్లతో ఘనవిజయం సాధించారు.
మొత్తంగా ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మూడింటికి మూడు స్థానాల్లో విజయభేరి మోగించింది. టీడీపీ క్లీన్ స్వీప్ పై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు. గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్. ఇది ప్రజా విజయం, మార్పునకు సంకేతం. మంచికి మార్గం… రాష్ట్రానికి శుభసూచకమని చంద్రబాబు అభివర్ణించారు.