Weather Update: వాతావరణ శాఖ హెచ్చరికలు.. తెలుగు రాష్ట్రాలలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు

Kaburulu

Kaburulu Desk

March 18, 2023 | 09:11 AM

Weather Update: వాతావరణ శాఖ హెచ్చరికలు.. తెలుగు రాష్ట్రాలలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు

Weather Update: బుధవారం, గురువారం నుంచి కురుస్తున్న అకాల వర్షానికి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాలలో మిర్చి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుండగా.. పత్తి రైతుల పరిస్థితి ఆందోళనగానే ఉంది. మిర్చి కోతలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ఆరబోసిన మిర్చి తడిసింది. మరోవైపు పూత పిందె దశలో ఉన్న మామిడి మొత్తం నేలరాలింది.

కాగా, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్‌ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ విషయానికి వస్తే పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

శనివారం (మార్చి 19న) తెలంగాణలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం, వికారాబాద్, నాగర్ కర్నూలు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం (మార్చి 20న) రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఇక 21న కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.