CPI Narayana: ఇదేందయ్యా ఇది.. ఒక్క మహిళకి 18 మంది భర్తలా.. షాక్ తిన్న సీపీఐ నారాయణ!

Kaburulu

Kaburulu Desk

March 9, 2023 | 11:35 PM

CPI Narayana: ఇదేందయ్యా ఇది.. ఒక్క మహిళకి 18 మంది భర్తలా.. షాక్ తిన్న సీపీఐ నారాయణ!

CPI Narayana: మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నారని మహాభారతం చెప్తుంది. అయితే, ఒక్క మహిళకి 18 మంది భర్తలున్నారు. ఏంటి ఇది నిజమా అంటే నిజమే. కాకపొతే నిజంగా కాదు.. ఓటర్ లిస్టులో ఒక్క మహిళకి 18 మంది భర్తలు ఉన్నట్లు నమోదు చేశారు. ఇది చూసిన సీపీఐ నారాయణ షాక్ తిన్నంత పని అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలోని తిరుపతి పట్టణంలో తాజాగా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి నారాయణ పర్యటించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ జాబితాను పరిశీలించేందుకే నారాయణ ఈ క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని యశోదనగర్ లో ఓటర్ల జాబితా పరిశీలిస్తుండగా ఓ ఇంట్లో 30, వలంటీర్ ఇంట్లో 12, మరో ఇంట్లో 8 దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించారు. వీటిని చూసి నారాయణ విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవలు అందిస్తున్న వలంటీర్ ఇంట్లో 12 దొంగ ఓట్లు కనిపించడంతో ప్రభుత్వమే దగ్గరుండి దొంగ్ల ఓట్లు నమోదు చేయిస్తోందని ఆరోపించారు.

దీంతో పాటు ఒక్క మహిళకు 18 మంది భర్తలు ఉన్నట్లు జాబితాలో ఓట్లు నమోదు చేయడంపై నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. దొంగ్ల ఓట్ల నమోదుకు అనుమతించిన అధికారులను బహిరంగంగా ఉరి తీసినా పాపం లేదని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల ఎన్నికల్లో విద్యార్హత కలిగిన వారికి ఓటు హక్కు కల్పించడం లేదు. పైగా అర్హత లేని వారి పేర్లతో జాబితా రూపొందించడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక్క తిరుపతిలోనే ఏకంగా 7 వేల దొంగ ఓట్లు ఉన్నాయని నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. దొంగ ఓటర్ల జాబితా, అర్హత కలిగిన వారికి ఓటు హక్కు కల్పించకపోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న ఆయన ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష పార్టీల తరఫున బరిలో ఉన్న పీడీఎఫ్ అభ్యర్థులే విజయం సాధిస్తారని నారాయణ ధీమా వ్యక్తం చేశారు.