Telanagan MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం!

Telanagan MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలు కాగా అందులో ఇండిపెండెట్ అభ్యర్థి పాలమూరి కమల నామినేషన్ ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది.
అప్పట్లోగా బరిలో ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ఉండటంతో ఆ ముగ్గురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్ కుర్మయ్య నామినేషన్లు మాత్రమే ఉపసంహరణ సమయానికి మిగిలి ఉండగా.. ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఈసీ ప్రకటించింది.
అనంతరం ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి నుంచి దృవీకరణ పత్రాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ ఫలితాలలో బీఆర్ఎస్ వర్గాల్లో హర్షం నెలకొంది. ఎన్నికైన వారిలో దేశపతి శ్రీనివాస్ తెలంగాణ కవి, గాయకుడు కాగా సిద్దిపేట జిల్లా వాసి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన శ్రీనివాస్.. తెలంగాణ సాధన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం సీఎం ఓఎస్డీగా పని చేస్తున్నారు.
హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన కుర్మయ్యగారి నవీన్కుమార్ తాత రామచంద్రరావు గతంలో మంత్రిగా పనిచేయగా.. మేనమామ సుదర్శన్రావు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. విద్యార్థి దశ నుంచే నవీన్ రాజకీయాలలో ఉండగా.. 2019 మేలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ మార్చిలో పదవీకాలం పూర్తవనుండగా మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
చల్లా వెంకట్రామిరెడ్డి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురు కొడుకు) కాగా.. అయిన జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు గ్రామ ప్రెసిడెంట్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. 2004లో అలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఏడాది కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరగా సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు.