TDP-Leftists: ఎమ్మెల్సీ ఎన్నికలే టార్గెట్.. ఈ స్థానాల‌లో వామ‌ప‌క్షాల అభ్య‌ర్థుల‌కు టీడీపీ మ‌ద్ద‌తు

Kaburulu

Kaburulu Desk

March 8, 2023 | 04:10 PM

TDP-Leftists: ఎమ్మెల్సీ ఎన్నికలే టార్గెట్.. ఈ స్థానాల‌లో వామ‌ప‌క్షాల అభ్య‌ర్థుల‌కు టీడీపీ మ‌ద్ద‌తు

TDP-Leftists: ఏపీలో ఇంకా ఎన్నికలకు ఏడాది పైగా సమయం ఉండగా.. ఈసారి పొత్తులు ఎలా ఉంటాయని వాడీ వేడీ చర్చలు సాగుతూనే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సార్వత్రిక ఎన్నికలలో జనసేనతో పొత్తు దాదాపుగా ఖరారైన సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటనలు రాకపోయినా ఈ చెలిమి ఖాయమేనని ఇరువర్గాలు అనధికారికంగా ప్రకటించాయి. కాగా, ఈలోగానే ఎమ్మెల్సీ ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ వామపక్షాలతో చెలిమి చేస్తుంది.

ఏపీలో ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదింటిలో మూడు పట్టభద్రుల స్థానాలు ఉండగా రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయడం లేదు. కేవలం పట్టభద్రుల స్థానాల్లోనే పోటీ చేస్తోంది. దీంతో చంద్రబాబు తాము పోటీ చేస్తున్న మూడు పట్టభధ్రుల స్థానాల్లో విజయం సాధించాలని కంకణం కట్టుకున్నారు.

ఇందుకోసం కమ్యూనిస్టు పార్టీల మద్దతు కోరిన టీడీపీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇస్తే.. తాము ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తమ మద్దతు ఇచ్చేలా హామీలు లభించినట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఒక్కటై పోటీకి దిగడం ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

టీడీపీ, కమ్యూనిస్టుల ప్రతిపాదన ప్రకారం.. పట్టభద్ర స్థానాల్లో వామపక్షాలు మొదటి ప్రాధాన్య ఓటును తమ వారికి వేసుకుని రెండో ప్రాధాన్య ఓటును టీడీపీకి వేస్తాయి. అలాగే టీడీపీ కూడా మొదటి ప్రాధాన్య ఓటును తనకు వేసుకుని రెండో ప్రాధాన్య ఓటును వామపక్షాల అభ్యర్థులకు వేస్తుంది. దీనికి బదులుగా ఉపాధ్యాయ స్థానాల్లో పీడీఎఫ్‌ అభ్యర్థులను టీడీపీ బలపరచనున్నారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై సంయుక్త ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.