Bandi Sanjay: తెలంగాణలో డెత్ పెనాల్టీగా మారిన ట్రాఫిక్ చలాన్లు.. బండి సంజయ్ ఘాటు విమర్శలు!

Kaburulu

Kaburulu Desk

March 8, 2023 | 02:51 PM

Bandi Sanjay: తెలంగాణలో డెత్ పెనాల్టీగా మారిన ట్రాఫిక్ చలాన్లు.. బండి సంజయ్ ఘాటు విమర్శలు!

Bandi Sanjay: తెలంగాణలో వాహనాలపై ట్రాఫిక్ చలానాలు డెత్ పెనాల్టీగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేక సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.

చింతల్ బస్తీ ప్రాంతంలో నివాసం ఉండే 52 ఏళ్ల ఎల్లయ్య రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందేవాడు. అతని భార్య మల్లమ్మ అదే ప్రాంతంలో సాయిబాబా ఆలయంలో హెల్పర్ గా పనిచేస్తుంది. అయితే ఎల్లయ్య వాహనంపై అనేక ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు అతడి వాహనాన్ని సీజ్ చేయగా.. అప్పటి నుంచి అతను మానసికంగా కుమిలిపోయాడు.

ట్రాఫిక్ చలానాలను చెల్లించలేదని పోలీసులు వాహనాన్ని సీజ్ చేసిన అంశాన్నే మనసులో పెట్టుకున్న ఎల్లయ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి.. తన ఆత్మహత్యకు కారణం ట్రాఫిక్ చలానాలేనని.. ట్రాఫిక్ పోలీసులేనని అందులో పేర్కొన్నాడు. దీంతో ఎల్లయ్య మరణంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగారు. ట్రాఫిక్ చలానాల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను పీల్చి పిప్పి చేస్తుందని దుయ్యబడుతున్నారు.

ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేకనే ఓ సామాన్యుడు ఆత్మహత్య చేసుకున్నాడని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లు డెత్ పెనాల్టీగా మారాయని.. పదివేల చలాన్లు చెల్లించలేక ఎల్లయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. సామాన్యుడి పై ప్రతాపం చూపించే బదులు బిఆర్ఎస్ ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు మానవత్వంగా వ్యవహరించాలని ట్వీట్ చేశారు.