Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు.. విచారణకు రాలేనని కవిత సమాధానం!

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాతో పాటు పలువురు ప్రముఖులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మొత్తం 11మందిని ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసులో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది. విచారణ కోసం కవిత రేపు గురువారం ఢిల్లీ రావాలని ఈడీ నోటీసులో పేర్కొంది.
అయితే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు కవిత ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే ధర్నా ముందు రోజే అంటే రేపే ఢిల్లీలో ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని ఈడీ కవితకు ఇచ్చిన నోటీసుల్లో తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. కవితపై 177 /A 120/ B , 7of PC act కింద 2022లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే కవితను విచారించనున్నారు.
గతంలోనూ కవితకు విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తును కవిత ఎదుర్కొన్నారు. హైదరాబాద్లోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు కవితను విచారించిన సంగతి తెలిసిందే. కాగా, ఈడీ నోటీసులపై స్పందించిన కవిత తాను విచారణకు ప్రస్తుతం హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు. ఈ నెల 15 తరువాతే విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో మహిళల రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 10న నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నామని, అందుకే విచారణకు రాలేనని కవిత లేఖలో తెలిపారు.
మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ఈ కేసులో కీలక వ్యక్తి అయిన రామచంద్ర పిళ్లైని నిన్న అధికారులు అరెస్ట్ చేయగా.. ఈడీ విచారణలో ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. ఈ స్కామ్లో కవితకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.