Earthquake: కర్నూలులో భూకంపం.. రోడ్లు, ఇళ్లకు పగుళ్లు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!

Earthquake: భూకంపం.. ఈ మాట వింటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల వెన్నులో వణుకు పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.. టర్కీలో సంభవించిన భూకంపంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ఆ తర్వాత వరుసగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. టర్కీలో భూకంపం తర్వాత భారత్లోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో భూమి కంపించింది. జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఉలిక్కిపడిన జనం ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం కారణంగా స్థానికులు భయంతో బయటకు పరుగులు తీయగా.. భూకంపం కారణంగా 14 ఇళ్లకు, సిమెంట్ రోడ్లకు పగుళ్లు వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఉన్నతాధికారులు రాతన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే రిక్టర్ స్కేలుపై ఎంత నమోయ్యింది? అనే విషయాలు ఇంతవరకూ తెలియరాలేదు. ఏయే ప్రాంతాల్లో ఇళ్లు పగుళ్లు వచ్చాయి? ఎంతమేరకు నష్టం వాటిల్లిందనే దానిపై స్థానికులను అడిగి అధికారులు ఆరాతీస్తున్నారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.
గత నెలలో కూడా ఏపీలో పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలో భూప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు. నందిగామ, కంచికర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో భూకంపం సంభవించగా.. పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఇప్పుడు రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఈ ప్రకంపనలు కనిపించాయి.