Srikakulam: ఆటో నుండి కిందపడిపోయిన రూ.500 నోట్ల కట్టలు.. ఏరుకున్న రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు!

Kaburulu

Kaburulu Desk

March 5, 2023 | 03:01 PM

Srikakulam: ఆటో నుండి కిందపడిపోయిన రూ.500 నోట్ల కట్టలు.. ఏరుకున్న రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు!

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఓ రోడ్డుపై రూ.500 నోట్ల వర్షం కురిసింది. ప్రయాణిస్తున్న ఆటో నుండి రూ.500 నోట్ల కట్టలు కిందపడిపోగా.. ఆటోలో వెళ్తున్న వారు పట్టీపట్టనట్లు, ఏమీ ఎరగనట్లు వెళ్లిపోయారు. ఆటో వెనక అదే రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు కొందరు ఆ కింద పడిన నోట్లను ఏరుకోగా.. దగ్గరలోని టోల్ గేట్ సిబ్బంది మరి కొన్ని నోట్లను సేకరించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన సంచలనం సృష్టించింది.

పూర్తివివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి శ్రీకాకుళం వైపు నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న ఓ ఆటోలో నుంచి రూ. 500 నోట్లు బయటపడ్డాయి. నోట్లు కిందపడిన విషయాన్ని ఆటోలో ప్రయాణిస్తున్నవారు గుర్తించినా తమకేమీ సంబంధమే లేదన్నట్లు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో కొందరు టోల్‌గేట్ సిబ్బంది ఆటోను వెంబడించగా ఆటో వారికి చిక్కలేదు. కిందపడిన నోట్లలో ఆటో వెనక వెళ్లే ప్రయాణికులు కొందరు కొన్ని ఏరుకుని వెళ్లిపోయారు.

శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకి వచ్చింది. కాగా, ఆటో ముందు ఓ బైకు కూడా ఉండగా.. ఆటో నెంబర్, బైక్ నంబర్ కోసం టోల్ గేట్ సిబ్బంది ప్రయత్నించినా వీలుపడలేదని చెప్తున్నారు. టోల్ గేట్ సిబ్బందే పోలీసులకు సమాచారమివ్వగా.. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు చేశారు. టోల్ గేట్ సిబ్బందికి దొరికిన నగదు వరకు పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.

కాగా, ఏపీలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. పోటీచేసిన అభ్యర్థులందరూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడిక్కడ రాజకీయాల పార్టీల జిల్లాల నేతలు తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరపున తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే శ్రీకాకుళం లాంటి వెనకబడిన జిల్లా రోడ్లపై నోట్లు ఇలా కిందపడడం కలకలం రేపింది.