Global Investment Summit 2023: ప్రపంచ పారిశ్రామిక వేత్తల కోసం అదిరిపోయే ఆంధ్రా రుచులు!

Global Investment Summit 2023: ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన తొలి ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా యువతకు ఉపాధి కల్పించగలమని ధీమాగా చెప్తుంది. మొత్తం 26 దేశాల నుంచి 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.. సమ్మిట్ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించబోతున్నారు.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సహా పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు.. ఈ సమ్మిట్ ద్వారా 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సమీకరించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు.. దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నా రు. ఏపీలోని ఆంధ్రా, రాయలసీమ, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలలో ఫేమస్.. వెజ్, నాన్వెజ్ రుచులను వీరికి అందించేం దుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
అందులో ముఖ్యంగా రాయలసీమ రాగి సంకటి, నాటుకోడి, గుంటూరు గోంగూర పచ్చడి వంటి ఆంధ్రా వంటకాలు మెనూలో ఉన్నాయి. ఇక, తొలిరోజు మధ్యాహ్నం భోజనంలో బొమ్మిడాయిల పులుసు, గుంటూరు కోడి వేపుడు, రొయ్యల మసాలా, మటన్ కర్రీ, చికెన్ పలావ్, వెజ్ రకాల్లో మష్రూం, క్యాప్సికంకూర, ఆలూ గార్లిక్ ఫ్రై, కేబేజీ మటర్ ఫ్రై, వెజ్ పలావ్, రోటీ, కుల్చా, పన్నీర్ బటర్ మసాలా, మెంతికూర–కార్న్ రైస్, మిర్చి కా సలాన్, టమాటా పప్పు, బీట్రూట్ రసం, మజ్జిగ పులుసు, గోభీ ఆవకాయ, నెయ్యి, వడియాలు, ద్రాక్ష పండ్ల పచ్చడి, చల్ల మిర్చి ఉంటాయి. అలాగే కట్ ఫ్రూట్స్, ఐస్క్రీం, పేస్ట్రీ, కాలా జామున్, జున్ను చంద్రకాంతలు సిద్ధం చేస్తున్నారు..
ఇక, రెండో రోజు అంటే శనివారం.. లంచ్లో రష్యన్ సలాడ్స్, వెజ్ సలాడ్లతో పాటు రుమాలి రోటీ, బటర్ నాన్ ఇస్తారు. నాన్ వెజ్ రకాల్లో ఆంధ్రా చికెన్ కర్రీ, చేప ఫ్రై, గోంగూర, రొయ్యల కూర, ఎగ్ మసాలా, మటన్ పలావ్.. వెజ్ ఐటమ్స్ లో వెజ్ బిర్యానీ, కరివేపాకు రైస్, కడాయ్ పన్నీరు కూర, క్యారెట్ బీన్స్ కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి కారం, బెండకాయ–జీడిపప్పు ఫ్రై, పప్పు చారు, మిరియాల రసం, మజ్జిగ పులుసు, ఉలవచారు.. క్రీం వంటివి ఉండబోతున్నాయి.