KTR: మెదడు మోకాళ్ళలో ఉందా.. అరికాళ్ళలో ఉందా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం!

KTR: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్ళలో ఉందా.. లేక అరికాళ్లలో ఉందా అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ఎంతో శ్రమపడి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాడని అంటున్నారని.. మరి శాస్త్రవేత్తలంతా గడ్డి కోశారా? ఇలాంటి వ్యాఖ్యలు చేసే కిషన్ రెడ్డిని ఏమనాలి? అని కేటీఆర్ మండిపడ్డారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రూ.125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని తీవ్రంగా విమర్శించారు. ఈడీ, సీబీఐకి భయపడేది లేదన్న కేటీఆర్.. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ ఎంజీఎంలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి దురదృష్టావశాత్తూ కాలేజీలో జరిగిన గొడవల్లో మనస్తాపానికి గురై చనిపోతే.. ఆ అంశాన్ని కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం. మంత్రులు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి.. తమ పార్టీ, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా సంతాపం ప్రకటించాం.
కానీ, కొంత మంది రాజకీయంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే.. వాడు సైఫ్ కావొచ్చు.. సంజయ్ కావొచ్చు.. ఇంకెవడైనా సరే.. వదిలిపెట్టం. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా శిక్ష వేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్నారు.
కాగా, కేసీఆర్ను విమర్శిచేందుకు విపక్షాలకు కారణం దొరకట్లేదు. ఏ తప్పు దొరక్క కుటుంబ పాలన అని కేసీఆర్ను విమర్శిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి చెబుతున్నా.. మాది కుటుంబ పాలనే అని బరాబర్ చెబుతున్నా అని కేటీఆర్ స్పష్టం చేశారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులేనని.. ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగస్వామినే. రైతులందరికీ పెద్దన్నలాగా కేసీఆర్ అండగా ఉన్నారని చెప్పారు.