Anurag Thakur: మెగాస్టార్ ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. నాగార్జున, అల్లు అరవింద్‌తో సమావేశం!

Kaburulu

Kaburulu Desk

February 27, 2023 | 01:27 PM

Anurag Thakur: మెగాస్టార్ ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. నాగార్జున, అల్లు అరవింద్‌తో సమావేశం!

Anurag Thakur: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఆయన మెగాస్టార్ చిరంజీవితో భేటీ కావడం ఆసక్తిగా మారింది. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లి మరీ అనురాగ్ ఠాకూర్ కాసేపు ముచ్చటించారు. చిరంజీవితో పాటు నాగార్జున, అల్లు అరవింద్‌లు కూడా చిరంజీవి నివాసానికి వెళ్లి అనురాగ్ ఠాకూర్‌‌ను కలిశారు. ఈ సందర్బంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాల గురించి వారితో కేంద్ర మంత్రి చర్చించారు.

ముందుగా ఇంటికి వచ్చిన కేంద్ర మంత్రిని చిరంజీవి, నాగార్జున శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు వినాయకుడి ప్రతిమను బహూకరించారు. అనురాగ్ ఠాకూర్‌‎తో భేటీ ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు మెగాస్టార్. తన నివాసానికి వచ్చిన అనురాగ్ ఠాకూర్‎కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. తన వద్దకు రావడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సోదరుడు నాగార్జునతో కలిసి భారతీయ సినీపరిశ్రమ గురించి కేంద్రమంత్రితో జరిపిన ఆహ్లాదకరమైన చర్చలు నచ్చాయని వెల్లడించారు.

ప్రస్తుతం ఈ భేటీ తాలూకు ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రానున్నది ఎన్నికల కాలం కావడంతో వీరి భేటీపై ఆసక్తి నెలకొంది. ఇటీవల కాలంలో దేశంలో ప్రముఖ క్రీడాకారులను, నటులను బీజేపీ ముఖ్య నేతలు కలస్తుండగా.. ఇప్పుడు కేంద్రమంత్రి స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లడం.. నాగార్జున, అల్లు అరవింద్ కూడా ఈ సమావేశానికి హాజరవడంతో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది.

ఇండియన్ సినిమా విశేషాలపై చర్చ కోసమైతే.. పలువురు నిర్మాతలు, దర్శకులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించే అవకాశం ఉంటుంది. కానీ.. ఈ సమావేశానికి చిరంజీవి సన్నిహితులైన నాగర్ణున, అల్లు అరవింద్ మాత్రమే హాజరయ్యారు. దీనిని బట్టి చూస్తే ఇది మెగాస్టార్, కేంద్రమంత్రి వ్యక్తిగత సమావేశంలాగానే కనిపిస్తుంది. మరి.. ఈ భేటీ అసలు కారణం ఏంటో? సినీ విశేషాలతో పాటు ఈ సమావేశంలో ఏమేం చర్చించారన్నది తెలియాల్సి ఉంది.